నల్లగా ఉన్నావని భార్యను గెంటేశాడు: ఆందోళన
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఆదోని తిరుమలనగర్లో అందంగా లేదంటూ ఓ భర్త కట్టుకున్న భార్యను ఇంటిలో నుంచి గెంటేశాడు. దీంతో భార్య అరుణ న్యాయం జరగాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తిరుమలనగర్కు చెందిన చంద్రశేఖర్రెడ్డి, అరుణను ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న అరుణను అదనపు కట్నం కావాలంటూ చంద్రశేఖర్రెడ్డి వేధింపులకు గురిచేశాడు.
అదనం కట్నం గురించి అరుణ ఏమీ మాట్లాడకపోవడంతో అందంగా లేదనే సాకుతో ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు అరుణ దీక్షకు దిగింది. మరోవైపు శాడిస్టు భర్తపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భర్త గెంటేసినా అతనితోనే తన జీవితం అంటూ అరుణ పట్టుబడుతోంది.
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన శేషమ్మ, వెంకటేశ్వర రెడ్డి దంపతుల కూతురు చరిత (అరుణ)కు ఏడాదిన్నర క్రితం కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డితో వివాహమైంది. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల వ్యాపారి అయిన చంద్రశేఖర రెడ్డి కుటుంబం ఆదోనీలోని తిరుమలనగర్లో నివాసం ఉంటోంది.
ఎంటెక్ పూర్తి చేసిన అరుణ (చరిత) మాత్రం హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లిలో చరిత తల్లిదండ్రులు కట్నకానుకల కింద చంద్రశేఖర రెడ్డికి రూ. 5 లక్షల నగదు, 15 తులాల బంగారం ఇచ్చారు. నాలుగైదు నెలలుగా బాగానే ఉన్న చంద్రశేఖర రెడ్డి ఆ తర్వాత భార్యను వేధించడం ప్రారంభించాడు. వ్యాపారం డబ్బులు అడిగితే మరో రూ.2 లక్షలు కూడా ఇచ్చారు.
భార్యను ఇంటి నుంచి గెంటేసిన చంద్రశేఖర రెడ్డికి ఆయన తల్లిదండ్రులు చాముండేశ్వరి, రామచంద్రా రెడ్డి కూడా అండగా నిలిచారు. మధ్యలో కుల పెద్దలు, పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చినా ఆ తర్వాత పరిస్థితి ఎప్పటి లాగే మారింది. ఇంటికి రాగానే ఆమెను వేధించడం ప్రారంభించాడు వెంకటేశ్వర రెడ్డి. తమకు చరిత ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.