చంద్రబాబును కలిసేందుకు వచ్చి!: అసెంబ్లీ ఎదుట యువతి 'ఆత్మహత్యాయత్నం'
కొద్దిరోజులుగా తనకు వేతనం రావట్లేదని, ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయడానికి కళ్యాణి అసెంబ్లీ వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది.
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. ఓ యువతి అసెంబ్లీ బయట ఆత్మాహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఏపీ అసెంబ్లీ రెండో గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన యువతిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళ్యాణిగా గుర్తించారు.
గ్రేడ్-4 ఉద్యోగిగా పనిచేస్తోన్న కళ్యాణి సీఎం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఈ ఉదయం అసెంబ్లీ వద్దకు వచ్చింది. అయితే అసెంబ్లీ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇదే క్రమంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది.
కొద్దిరోజులుగా తనకు వేతనం రావట్లేదని, ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయడానికి కళ్యాణి అసెంబ్లీ వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు యత్నించడంతో తక్షణం అప్రమత్తమైన సిబ్బంది ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
కాగా, కళ్యాణి గతంలోను ఇలాగే ప్రవర్తించిందని, అప్పుడు సీఎం ఆమెకు రూ.25వేలు అందజేశారని, ఇక అప్పటినుంచి ఇలాగే వ్యవహరిస్తుందని ఆమె స్నేహితులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.