వేధింపులు, హైదరాబాద్లో ఏలూరు మహిళా టెక్కీ ఆత్మహత్య, పోలీసుల అదుపులో భర్త
హైదరాబాద్: నగరంలో ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె హైదరాబాదులోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తెలుస్తోంది. మృతురాలి పేరు రూపిణి. ఆమె ఆదివారం ఉదయం ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఈ ఘోరం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతానికి చెందిన సందీప్తో రూపిణికి ఈ ఏడాది మే నెలలో పెళ్లి జరిగింది. పెళ్లయిన నాలుగు నెలలకే వరకట్న వేధింపులు మొదలయ్యాయి.
సందీప్, రూపిణిలది ప్రేమ వివాహం. ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని సందీప్ తల్లిదండ్రులు వేధిస్తున్నారని తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలల నుంచే వేధింపులు ఉన్నాయని రూపిణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రూపిణి భర్త సందీప్ జిమ్ ట్రెయినర్గా ఉన్నారు.
గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వేధింపులు, ఘర్షణల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రూపిణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాయదుర్గం పోలీసులు భర్త సందీప్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.