టెక్కీ భవ్యశ్రీ అదృశ్యంలో ట్విస్ట్లే: స్వచ్ఛంధంగానా?
హైదరాబాద్: టెక్కీ భవ్యశ్రీ మిస్సింగ్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. భవ్యశ్రీని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఆమె స్వచ్ఛంధంగా వెళ్లారా అనే విషయమై ఆరా తీస్తున్నారు. భవ్యశ్రీ ఆచూకి లభించిందని, పోలీసులు ఆమెను హైదరాబాదుకు తీసుకు వచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, తీసుకు వచ్చారా లేదా అనేది కచ్చితంగా ఇంకా తెలియరాలేదు. ఆమెను నేడో, రేపో మీడియా ముందుకు పోలీసులు తీసుకు వస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
రెండు రోజుల క్రితం ప్రైవేటు క్యాబ్లో కంపెనీకి బయలుదేరిన భవ్యశ్రీ ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. కొద్ది నెలల క్రితం హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు కారులో ఎక్కించుకుని ఆమెపై అఘాయిత్యం చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఐటీ కారిడార్లో పెట్రోలింగ్తో పాటు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ తరు ణంలో భవ్యశ్రీ ప్రైవేటు క్యాబ్లో ప్రయాణించి అదృశ్యమవ్వడం అటు పోలీసులను, ఇటు మీడియాను పరుగులు తీయించింది.
రెండు రోజులుగా మిస్టరీగా ఉన్న భవ్యశ్రీ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. వివరాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. భవ్యశ్రీ ఎక్కడుందన్న టెన్షన్ ఆమె ఆచూకీ లభ్యం కావడంతో వీడిపోయింది. ఇక పలు ప్రశ్నలకు జాబులు రావాల్సి ఉంది. భవ్యశ్రీ రెండున్నరేళ్ల క్రితం కార్తిక్ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది.
ఆమెకు భర్తతో ఏనాడు వివాదాలు లేవని ఇద్దరి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అటువంట ప్పుడు ప్రైవేటు క్యాబ్లో కంపెనీకి వెళ్తున్నానని వాట్సప్లో మెసేజ్ చేసిన భవ్యశ్రీ తిరిగి భర్త కార్తిక్ చైతన్య చేసిన మెసేజ్కు ఎందుకు స్పందించలేదన్నది తెలియాలి. క్యాబ్లో ఉన్న భవ్యశ్రీని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఒకవేళ అదే జరిగితే అందుకు కారకులెవరు? ఎందు కు కిడ్నాప్ చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నల చిక్కుముడులు విప్పాల్సి ఉంది.
ఇవేమీ కాకుండా భవ్యశ్రీనే స్వచ్ఛందంగా హైదరాబాద్ సరిహద్దులు దాటారా అనేది తేలాల్సి ఉంది. అయితే భవ్యశ్రీ గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నారు. కానీ ఆమె తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరంలో ఉందని కొందరు, విశాఖపట్నంలో ఉందని మరికొందరు, ఈ రెండూ కాదు పాడేరులో ఉన్నట్టు సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారని ఇంకొందరు చెబుతున్నారు.
భవ్యశ్రీ నిజంగా ఈ ప్రాంతాలన్ని తిరిగిందా? తిరిగితే ఆమె ఒంటరిగా వెళ్లిందా? ఎవరైనా సహకరించారా? అన్నది తెలియాల్సి ఉంది. భవ్యశ్రీ అదృశ్యమైన కేసును కేపీహెచ్బీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగా, భవ్యశ్రీ ఇంకా దొరకలేదు అన్న సమాచారం వస్తుండడంతో అటు కార్తిక్ చైతన్య తల్లిదండ్రులు, ఇటు ఆమె తల్లిదం డ్రులు ఆందోళనలో ఉన్నారు. ఇంటి నుంచి క్యాబ్లో బయలుదేరిన భవ్యశ్రీ రైలులో ఇతర ప్రాంతాలకు వెళ్లిందని తెలుస్తోంది. వీటి పైన పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు, భవ్యశ్రీ మిస్సింగ్లో ఎలాంటి కుట్ర కోణం లేదని కూడా బహిర్గమైనట్లుగా తెలుస్తోంది. భవ్యశ్రీ కోసం ఐదు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నప్పటికీ.. మనస్పర్థలతో భవ్యశ్రీ అతడికి చెప్పకుండా అదేరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖకు బయలుదేరిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే, మీడియాలో తన గురించి వార్తలు రావడంతో.. భవ్యశ్రీ తన భర్తకు ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నట్టు సమాచారం అందించిందని అంటున్నారు. ఈ విషయం కార్తికేయ పోలీసులకు తెలుపగా.. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారని, ఆమెను తీసుకు వచ్చారని, మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారని అంటున్నారు.