కరోనా వేళ కనికరం లేని మనుషులు... రాత్రంతా వర్షంలో తడుస్తూ...
కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపించవద్దని ప్రభుత్వాలు,వైద్య సిబ్బంది ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావట్లేదు. ముఖ్యంగా కొంతమంది ఇంటి యజమానులు అద్దెదారుల పట్ల దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కరోనా సోకిందని తెలిస్తే చాలు... ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా రాజమండ్రిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... రాజమండ్రిలోని ఆల్కట్ గార్డెన్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండే మహిళ బుర్రిలంకలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఇటీవలి కరోనా టెస్టుల్లో ఆమె భర్తకు పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో హోం క్వారెంటైన్లో ఉండాలని వైద్యులు సూచించగా.. ఇంటి యజమాని,స్థానికులు అందుకు అభ్యంతరం తెలిపారు. దీంతో అతన్ని బొమ్మూరులోని ప్రభుత్వ క్వారెంటైన్ కేంద్రానికి తరలించారు.
ఆరోజు రాత్రి ఇంటికి వచ్చిన ఆమెను ఇంటి యజమాని అడ్డుకున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టవద్దని హెచ్చరించాడు. దీంతో సమీపంలోనే నిర్మాణంలో ఉన్న తమ సొంతింటి వద్దకు వెళ్లింది. అయితే అక్కడ కూడా స్థానికులు ఎగబడి ఆమెను అడ్డుకున్నారు. గేటుకు తాళం వేసి ఇంట్లోకి వెళ్లకుండా చేశారు. దీంతో రాత్రి నుంచి రోడ్డు పైనే వర్షంలో తడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. స్థానికులు,ఇంటి యజమాని తన పట్ల దౌర్జన్యానికి పాల్పడుతున్నారని,దయచేసి అధికారులు జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.