పురుష కమిషన్ ఏర్పాటు గురించి నన్నపనేని వ్యాఖ్యలపై...మహిళా సంఘాలు ఫైర్
విజయవాడ:ఇటీవలి కాలంలో పురుషులపై మహిళుల దాడులు కూడా పెరిగాయని...అందువల్ల పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని సిఎంను కోరనున్నట్లు ఎపి మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
నన్నపనేని రాజకుమారి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని...ఆమె ఆలోచనలు అపరిపక్వంగా ఉన్నాయని మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్నపనేని మాటలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవని...తాము ఒకసారి నన్నపనేనిని కలిసి ఆమెకు నేటి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
మండిపడుతున్న...మహిళా సంఘాలు
నన్నపనేని రాజకుమారీ గారూ...అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో?...మహిళలకు ఏమైనా రక్షణ ఉందా?...చిన్న పిల్లలపై కూడా పైశాచిక దాడులు జరుగుతుంటే...పురుషుల రక్షణ కోసం... పురుష కమిషన్ వేయాలా?...అమ్మా నన్నపనేని...అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు...అంటూ మహిళా సంఘాలు ఆమె మీద ఆగ్రహోదగ్రులవుతున్నారు.
ప్రత్యేకంగా...ప్రెస్ మీట్ పెట్టి మరీ
ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత ప్రజాతంత్ర సంఘం, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.గంగాభవానీ, ఎం.లక్ష్మీ తదితరులు మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారి పురుష సమాజానికి అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మహిళలు కూడా అకృత్యాలు చేస్తున్నారని చెప్పడం దారుణం అన్నారు.
మహిళలకు అండగా...ఉండమంటే
మహిళలకు రక్షణగా ఉండాల్సిన నన్నపనేని రాజకుమారి పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు మహిళా సంఘాల నేతలు. అసలు నన్నపనేని మహిళా ఛైర్ పర్సన్ పదవి చేపట్టిన నాటి నుంచి పురుషులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయన్నారు. మీరు మహిళా కబీషన్ ఛైర్ పర్సన్ గా ఉండగా ఇంక వేరే పురుష కమీషన్ అవసరం లేదని మరి కొందరు మహిళా సంఘాల నేతలు వ్యంగాస్త్రాలు సంధించారు.
నన్నపనేని...రాజీనామాకు డిమాండ్
ఒక మహిళ అయి ఉండి దేశంలో,రాష్ట్రంలో మహిళలపై ఎన్నో అకృత్యాలు జరుగుతుంటే...వాటి సంఖ్యను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏవో కొన్ని సంఘటనలను ఉదాహరణ చూపించి పురుష కమీషన్ వేయాలని నన్నపనేని కోరడం దారుణం అని మహిళా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పురుష పక్షపాతిగా వ్యవహరిస్తున్న నన్నపనేని రాజకుమారి మహిళా ఛైర్ పర్సన్ గా పనికిరారని, ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.