కవ్విస్తోంది, కైపెక్కిస్తోంది : బండి దిగారే ఇక దబిడి దిబిడే
నెల్లూరు : జాతీయ రహదారి పక్కన, ఓ యువతి అందంగా అలంకరించుకొని కవ్విస్తోంది. టార్చ్లైట్ వెలుగుతో కైపెక్కిస్తోంది. ఆమె పిలుస్తోంది కదా అని .. బండి ఆపారో ఇక అంతే సంగతులు. నిలువుదోపిడీ చేసి .. ఉడయిస్తోంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
ఈజీ మనీ కోసం
నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని ఆమంచర్లకు చెందిన మల్లి శ్రీనివాసులు, వీరేశం బాలవర్ధన్, మట్యంపాటి అనిల్ స్నేహితులు. వీరంతా ఆటో నడుపుతుంటారు. నెల్లూరు సంతపేటకు చెందిన రమాదేవితో అనిల్కు వివాహేతర సంబంధం ఉంది. ఆటో నడిపిన డబ్బులు సరిపోవడం లేదని .. ఈజీ మనీ కోసం స్కెచ్ వేశారు. లారీ డ్రైవర్లు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. రమాదేవిని అలంకరించి .. రోడ్డుపై నిలబెడతారు. ఆమె లారీ డ్రైవర్లే లక్ష్యంగా గురిపెడుతుంది. తనను చూసిన లారీ డ్రైవర్లకు టార్చ్ లైట్తో తన అందాన్ని చూపిస్తోంది. డ్రైవర్ లారీ దిగాడో ఇక అంతే .. అతని పని అయిపోయినట్టే.
దిగారే ఇక అంతే
డ్రైవర్ బండి ఆపి దిగితే ఆమె పంట పండినట్టే. పక్కకు రా అని పొదల్లోకి తీసుకెళ్తుంది. అతని టెంప్ట్ కాస్త పొదల్లోకి వెళ్లాక నీరుగారిపోతుంది. అప్పటికే ముగ్గురు యువకులు ఉంటారు. డ్రైవర్ పై దాడి చేసి .. ఉన్నకాడికి దోచుకుంటారు. అతన్ని అక్కడే పడేసి .. తాము తీసుకొచ్చిన ఆటోలో వెళ్లిపోతారు ఆ నలుగురు. ఇలాంటి ఘటన ఖమ్మం చింతకాన్ని వంటలకు చెందిన శివాజీకి ఎదురైంది. దీంతో ఆయన వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
చిక్కిన నిందితులు
వీరిని ప్రణాళిక ప్రకారం పోలీసులు పట్టుకున్నారు. సుందరయ్య కాలనీ దాటిన తర్వాత ఖాళీ ప్రదేశంలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఆటో, ఐదు వేల నగదు, వెండి బ్రాస్ లెట్, ఉంగరం స్వాధీనం చేసుకున్నారు.