బతుకమ్మకు మహిళా సిఎంలు, లోకసభ స్పీకర్: కవిత
హైదరాబాద్: ఈసారి బతుకమ్మ ఉత్సవాలకు దేశంలోని మహిళా ముఖ్యమంత్రులను, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను ఆహ్వానించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు తెలంగాణ సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా నిర్వహిస్తామని ఆమె చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ పండుగపై నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు కేటాయించిందని ఆమె చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాలతో పాటు హైదరాబాద్ ట్యాంక్బండ్ వేదికగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.
ఎలక్ట్రానిక్ చానెల్ల నిషేధంతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. యాజమాన్యాలు, ఎంఎస్వోల మధ్య గొడవను ప్రభుత్వానికి ఆపాదించడం సరి కాదని కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఉత్సవాల నిర్వహణకు పది కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన నిర్ణయించారు. మహిళా ముఖ్యమంత్రులను ఆహ్వానించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.