నిధి కోసం మహిళతో నగ్న పూజలు చేయించిన స్వామీజీ...తరువాత ఆమే చితకబాదింది!
కర్నూలు:నాగరికత ఎంత పెరిగినా కొందరిలో మూఢ నమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదనడానికి ఇదో ఉదాహరణ. ముందు నకిలీ స్వామీజీలు, బాబాలు చెప్పింది నమ్మి మూర్కమైన పనులు చేయడం...ఆ తరువాత లబోదిబో మనడం సాధారణమైపోయింది.
అయితే కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఉదంతంలో మోసపోయిన మహిళ లబోదిబోమనలేదు కానీ తనను మోసగించిన వ్యక్తిని చితకబాదింది. విషయమేమిటంటే ...నీ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయి...అవి బైటకు రావాలంటే నువ్వు నగ్న పూజలు చేయాలంటూ ఆమెతో ఒక దొంగ స్వామీజీ నగ్నంగా క్షుద్ర పూజలు చేయించాడు. అయితే డబ్బు ఖర్చుపెట్టినా నిధి దొరక్కపోవడంతో ఆ స్వామీజీని తెచ్చిన వ్యక్తిని ఆమె చితకబాదింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నగ్న పూజ చేస్తేనే...నిధి
కర్నూలు జిల్లా మాధవరం గ్రామానికి చెందిన ఓ మహిళ (50) ఇంటికి తరచూ పాము వచ్చేదట. ఆమె ఈ విషయాన్ని రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెప్పింది. దీంతో అతడు ఈ విషయమై అనంతపురం జిల్లా పామిడికి చెందిన ఒక స్వామిని ఆశ్రయించడంతో ఆ స్వామీజీ ఈ మహిళ ఇంటికి వచ్చి పరిశీలించాడు. ఆ తరువాత ఆమెతో మీ ఇంట్లో నిధి ఉందని, అయితే రాత్రి పూట నగ్నంగా పూజలు చేస్తేనే ఆ నిధి దొరుకుతుందని నమ్మబలికాడు.
డబ్బు ఖర్చు...ఫలితం లేదు
అయితే ఇందుకోసం అతడు రూ.30 వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అందుకు సరేనన్న ఆమె ఆ స్వామీజీ చెప్పిన ప్రకారమే ఓ రోజు రాత్రి తన ఇంటికి వచ్చిన స్వామితో కలసి నగ్న పూజలు నిర్వహించింది. పూజ ముగిసి రోజులు గడిచినా నిధి బైటపడలేదు...పాము రావడం ఆగిపోలేదని ఆ మహిళ చెబుతోందట. దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ స్వామీజీని నా డబ్బు తిరిగి ఇవ్వాలని అడగింది. దీంతో స్వామి ఇదిగో ఇస్తా...అదిగో ఇస్తానంటూ...ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు.
రోడ్డు మీదే...చితక బాదింది...
దీంతో ఆ మహిళ తనకు ఆ స్వామీజీని పరిచయం చేసిన వ్యక్తిని నడిరోడ్డుపై చొక్కా పట్టుకొని గొడవచేసింది. డబ్బులివ్వకపోతే బజారుకు ఈడ్చి తంతానని అంటూ గొడవ పడింది. అనడమే కాదు ఆ వ్యక్తిని కొట్టింది కూడా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఉదంతం సంచలనం సృష్టించడంతో పాటు పంచాయితీ పోలిస్ స్టేషన్ కు చేరింది.
పోలీసులు...హెచ్చరిక
దీనిపై ఏఎస్ఐ గోపాల్ వివరాలు అడుగగా ఈ గొడవ 6 నెలల కిందటిదని, అయితే డబ్బు కోసం గొడవ ఇటీవలే జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే జనాలు ఇలాంటి మూఢ నమ్మకాలతో మోసపోవద్దని హెచ్చరించారు.