నంద్యాలలో రోజాకు మహిళల చుక్కలు, ఇంటికి పంపిస్తారా అని అఖిలపై రోజా ఆగ్రహం
వైసిపి నగరి ఎమ్మెల్యే రోజాకు నంద్యాలలో శనివారం చేదు అనుభవం ఎదురయింది. నంద్యాల 16వ వార్డులో మహిళలు ఆమెను నిలదీశారు.
నంద్యాల: వైసిపి నగరి ఎమ్మెల్యే రోజాకు నంద్యాలలో శనివారం చేదు అనుభవం ఎదురయింది. నంద్యాల 16వ వార్డులో మహిళలు ఆమెను నిలదీశారు. మహిళల దెబ్బకు ఆమె తన ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వైసిపి కార్యాలయానికి వెళ్లిపోయారు.
చదవండి: అఖిలా! బాబు ఎంత నీచుడో తెలుసుకో, తెల్లారే వైయస్ మృతి: రోజా సంచలనం
అఖిలప్రియపై రోజా ఆగ్రహం
ప్రచారంలో భాగంగా ఆమె 16వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా రోజా మంత్రి అఖిలప్రియపై నిప్పులు చెరిగారు. అఖిలకు తల్లితండ్రుల కంటే పదవులే ముఖ్యమన్నారు. నంద్యాలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఆమెకు లేదన్నారు. పదవుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. నీ తండ్రి చావుకు చంద్రబాబు కారణమని, అలాంటి వారికి మద్దతు పలకడమా అన్నారు.
మహిళా నేతగా ఉన్నారు.. చక్రపాణిపై మాట్లాడరేం
ఈ సందర్భంగా ఒక్కసారిగా మహిళలు రోజాను చుట్టుముట్టారు. తొలుత శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల బహిరంగ సభ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చక్రపాణి వ్యాఖ్యలపై ఓ మహిళగా మీరు ఎందుకు స్పందించడం లేదని రోజాను నిలదీశారు. చక్రపాణి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా అని నిలదీశారు.
వైసిపి వర్సెస్ మహిళలు
ఈ సమయంలో వైసిపికి, స్థానిక మహిళలకు వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అఖిలప్రియ సంప్రదాయాల గురించి మాట్లాడటం విచిత్రమని రోజా అనంతరం వైసిపి కార్యాలయంలో ధ్వజమెత్తారు.
మహిళలను పంపించి ధర్నాలు చేయిస్తారా
ఒక పార్టీ అభ్యర్థి ఇంటి ముందుకు కొంతమంది మహిళలను పంపించి రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం సమంజసం కాదన్నారు. కాపుల హక్కులను కాపాడుకోవడానికి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తే అందుకు అనుమతులు ఇవ్వరు కాని టిడిపి నేతలు దిష్టిబొమ్మలు దహనం చేయడానికి, ప్రదర్శనలకు మాత్రం అనుమతులు ఇస్తారని చెప్పారు.
హత్యా రాజకీయాలు చేసి
పత్తికొండ వైసిపి ఇంచార్జ్ శ్రీదేవి మాట్లాడుతూ.. తన భర్త నారాయణ రెడ్డిని కొందరు హత్య చేయించి ఇప్పుడు హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారన్నారు.