పోలీసుల వేధింపులు: తమ్ముడి ప్రేమ వ్యవహారం కేసు అక్క చావుకొచ్చింది
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఓ యువతి సెల్ టవర్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. పోలీసులు విచారణ పేరుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది.
అనంతరం కిందకు దూకేస్తానంటూ ఆ యువతి చేసిన హెచ్చరించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే తణుకు పట్టణం సజ్జాపురం ప్రాంతానికి చెందిన కాళిదాసు నాగప్రసాద్ అనే యువకుడికి ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
ఈ క్రమంలో నాగప్రసాద్, ఆ యువతితో కలిసి ఎక్కడికో పారిపోయాడు. దీంతో యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాగప్రసాద్ కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణ పేరిట పోలీసులు స్టేషన్కు పిలిపించుకుని వేధింపులకు పాల్పడుతున్నారంటూ సదరు యువతి ఆరోపించింది.
తమ తమ్ముడు ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ కేసుతో నాకు గానీ, నా తల్లిదండ్రులకు గానీ ఎలాంటి సంబంధించి లేదని సెల్ టవర్ ఎక్కి మరీ చెప్పింది. అదేమీ పోలీసులు పట్టించుకోకుండా విచారణ పేరిట తమను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు స్టేషన్లో కూర్చోబెడుతున్నారంటూ వాపోయింది.
తన తమ్ముడు ప్రేమించిన యువతితో కలిసి ఎక్కడికి వెళ్లాడో తెలియనప్పిటికీ తమపై వేధింపులకు పాల్పడుతున్నారని, తమను అకారణంగా పిలిచి వేధిస్తున్నారని నాగప్రసాద్ సోదరి మీనా సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సెల్టవర్ పైకెక్కింది.
పోలీసులు తమ కుటుంబంపై వేధింపులు ఆపకపోతే తాను కిందకు దూకేస్తానని బెదిరిచింది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ యువతిని నేరుగా జడ్జీ వద్దకు తీసుకెళతామని, సమస్యను న్యాయమూర్తికి చెప్పుకోవచ్చని ఆమెను బుజ్జగించారు. చివరకు పోలీసుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆ యువతి కిందికి దిగి రావడంతో వివాదం సద్దుమణిగింది.
జెయింట్ వీల్ ప్రమాదంలో పది మందికి గాయాలు
కృష్ణా జిల్లా రంగమ్మ పేరంటాళ్ల తిరునాళ్లలో సోమవారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం తేలప్రోలులో తిరునాళ్లు సందర్భంగా జెయింట్ వీల్ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అది తిరుగుతుండగా ఒక చెయిర్ వద్ద బోల్టు అకస్మాత్తుగా ఊడిపోయింది.
దీంతో జెయింట్ వీల్పై కూర్చున్న పది మంది యువకులు కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్సను అందిస్తున్నారు.