ఏపీ దిశ పోలీసుస్టేషన్లో రెండు కేసులు, భర్త, అత్తమామలపై వివాహితలు ఫిర్యాదు
Recommended Video
మహిళలపై వేధింపు సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్లకు బాధితులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో నమోదైన రెండు కేసుల్లో వివాహితలే ఫిర్యాదు చేశారు. కట్నం కోసం ఒకరని, మెంటల్లీ టార్చర్ పెడుతున్నారని మరొకరు కంప్లైంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 18 దిశ పోలీసుస్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఏడేళ్లుగా వేధింపులు..
రాజమహేంద్రవర ఇన్నిస్పేటకు చెందిన కొండపల్లి మౌనికాదేవి దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త, అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. ఏడేళ్లుగా చిత్రవధ అనుభవిస్తున్నానని కంప్లైంట్లో రాశారు. తన సమస్య పరిష్కరించాలని కోరారని.. కేసు నమోదు చేశామని దిశా మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ డీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
భర్త, అత్తమామలు..
రాజమండ్రిలోని నెహ్రూనగర్కు చెందిన కాలుపు సూర్య వెంకట జ్యోతిర్మయి కూడా దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కంప్లైంట్ చేశారు. శారీరకంగా, మానసికంగా టార్చర్ పెడుతున్నారని తెలిపారు. జ్యోతిర్మయి కేసు నమోదు చేశామని.. వీలైనంత త్వరగా రెండు కేసులను పరిష్కరిస్తామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
వారం రోజుల్లో దర్యాప్తు..
దిశ కేసుల్లో దర్యాప్తు వేగంగా పూర్తిచేసేందుకు యంత్రాంగాన్ని సమకూర్చుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంత్ ఇదివరకే పేర్కొన్నారు. ఆయా కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేస్తామని తెలిపారు. దిశ కేసుల్లో వారం రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టంచేశారు.
ఇదీ నేపథ్యం..
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో దిశపై నలుగురు మృగాళ్లు పాశవికంగా లైంగికదాడి చేసి, హతమార్చిన సంగతి తెలిసిందే. తర్వాత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు, మహ్మద్ ఆరిఫ్ పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు కాల్పులు జరపడంతో ఆ నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రభుత్వం దిశ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు 18 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు.