2019లో పిలిచినా కలవను: మోడీ ఆ మాటలు బాబుకు కోపం తెప్పించాయి!
న్యూఢిల్లీ: ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అవసరమైతే మళ్లీ ఆ పార్టీతో జత కలుస్తారనే వాదనలు ఉన్నాయి. దీనిపై ఆయన శనివారం ఢిల్లీలో క్లారిటీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయేలో చేరేది లేదని తేల్చి చెప్పారు. తనది తెలంగాణ సీఎం కేసీఆర్ పరిణితి కాదంటారా అని విమర్శించారు. అవినీతి వైసీపీ పార్టీలతో తమను పోలుస్తారా అని మండిపడ్డారు.
Recommended Video
కేసీఆర్తో గొడవలా, కాంగ్రెస్ నయం: బాబు మాట మారింది, మోడీ-పవన్పై నిప్పులు
అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోడీ.. కేసీఆర్ను లాగి చంద్రబాబును ఏకిపారేశారు. అలాగే, జగన్ ట్రాప్లో చిక్కుకుంటున్నారని తాను చంద్రబాబుకు చెప్పానని అన్నారు. ఈ అంశాలు చంద్రబాబును ఆగ్రహానికి గురి చేశాయి. వారితో తనను పోలుస్తావా అని నిప్పులు చెరిగారు. ఢిల్లీ వేదికగా మోడీకి ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
ఫోన్ చేసి జగన్ ఉచ్చులో పడొద్దని చెప్పా, ఏపీకి ఇదే నా హామీ, యూటర్న్: బాబును దులిపేసిన మోడీ
మీ తప్పును వారిపైకి నెడతారా?
వాజపేయి మూడురాష్ట్రాల విభజను సున్నితంగా చేశారని, కాంగ్రెస్ వాళ్లు అశాస్త్రీయంగా ఏపీని విభజించారని ప్రధాని అన్నారని, అలాంటప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దే బాధ్యత ఆయనకు లేదా అని చంద్రబాబు ప్రధానిని ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే హోదా ఇవ్వలేకపోతున్నట్లు మోడీ చెప్పారని, ఆర్థిక సంఘం ఎక్కడ అలా చెప్పిందో చూపించాలని డిమాండ్ చేశారు. మోడీ తన తప్పును ఆ సంఘాన్ని వివాదంలోకి లాగుతున్నారన్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నిర్వహించే తీరు ఇదా అన్నారు.
ఏపీ ప్రజలను అవమానించేందుకే నన్ను టార్గెట్ చేశారు
ప్రధానమంత్రి తనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు బాధించాయని చంద్రబాబు అన్నారు. ఒకవేళ 2019 ఎన్నికల్లో బీజేపీ సంప్రదించినా తాము ఎన్డీయే కూటమిలో చేరేదిలేదన్నారు. సమస్యల పరిష్కారంలో తాను యూటర్న్ తీసుకున్నట్లు మోడీ చెప్పారని, అసలు యూటర్న్ తీసుకున్నది ప్రధాని అన్నారు. వైసీపీతో ఉన్న రాజకీయ కారణాలతో తాను యూటర్న్ తీసుకున్నానని మోడీ తనపై నిందలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి పార్టీతో మాకు పోలికా అన్నారు. మేం పార్లమెంటులో పోరాడుతుంటే వారు కోర్టులో ఉంటున్నారన్నారు. అలాంటి వారితో తనను పోల్చి మాట్లాడుతారా అన్నారు. ప్రధాని ఇలాంటి పెట్టీ థింగ్స్ ఎందుకు చేస్తున్నారన్నారు. మోడీ తనను టార్గెట్ చేయడంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను అవమానించేందుకేనని తనను టార్గెట్ చేశారని అభిప్రాయపడ్డారు.
జగన్ ట్రాప్లో అంటే అదే చెప్పా
ఎన్డీయే నుంచి తాను బయటకు వచ్చిన సమయంలో మోడీ ఫోన్ చేసి వైసీపీ వలలో చిక్కుకున్నట్లుగా మాట్లాడితే, తప్పు చేయనంత కాలం తనకు ఏమీ కాదని బదులిచ్చానని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వస్తే అవినీతి కేసులను ఏడాదిలోపు ముగిస్తానని చెప్పిన మోడీ.. ఎందుకు ముగించలేదన్నారు.
నన్ను కేసీఆర్తో పోలుస్తారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ పరిపక్వత ప్రదర్శించారని, తాను ప్రదర్శించలేకపోయానని మోడీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అన్నారు. మోడీ కంటే ముందే తాను సీఎంను అనిగుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానం నైతికతకు, మెజార్టీకి మధ్య యుద్ధమన్నారు. ప్రతి సమస్యకూ రాజకీయ పరిష్కారం ఉంటుందని, కానీ కేంద్రం ఆ దిశగా ఏనాడూ చొరవ తీసుకోలేదన్నారు. నాయకత్వంపై అసలు మీ బీజేపీ ఎంపీల్లో విశ్వాసం ఉందా అన్నారు. 'కేసీఆర్ నా గౌరవనీయ సహచరుడిగా ఉన్నారు. నాకూ, ఆయనకూ మధ్య ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. మా అంతట మేమే అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుకుంటున్నాం. గవర్నర్, నేనూ కలిసే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. మా అధికారులు కూడా మాట్లాడుకుంటున్నారు. నిజానికి, మా ఇద్దరి మధ్య సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సి ఉంది. రాజకీయ కారణాల రీత్యావారు ఆ పని చేయలేదు'ని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ట్వీట్లు
టీడీపీ ఢిల్లీలో పోరాడుతుంటే, పవన్ కళ్యాణ్ ట్వీట్లతో తమను నిరుత్సాహపరుస్తున్నారని, ఇది బీజేపీతో కుమ్మక్కు కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాము బలపడతామన్న ఉద్దేశంతోనే ఆర్థికాంశాలతో సంబంధం లేని అసెంబ్లీ సీట్ల పెంపును కూడా కేంద్రం చేయడం లేదన్నారు. పవన్ ట్వీట్లు చేయడం మినహా ఏం లేదన్నారు. కేసీఆర్కు తనకు మధ్య సమావేశం ఏర్పాటు చేశానని ప్రధాని చెప్పిన విషయంలో వాస్తవం లేదన్నారు.