ఈ పథకానికి నాపేరొద్దు...ఆ అవసరం లేదు:సిఎం చంద్రబాబు;అమరావతి బాండ్లకి క్యాబినెట్ ఓకే
Recommended Video
అమరావతి:ఎపి ప్రభుత్వం నూతనంగా అమలులోకి తెస్తున్న నిరుద్యోగ భృతి పథకానికి తన పేరు పెట్టాలన్న మంత్రుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు.
ఈ పథకానికి ఏ పేరుపెట్టాలన్న విషయమై కేబినెట్లో విస్తృత చర్చ జరిగింది. ఈ పథకానికి 'యువ నేస్తం' అనే పేరును మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించగా... 'చంద్రన్న యువ నేస్తం' అని పెట్టాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. అయితే ప్రతి కార్యక్రమానికీ తన పేరు పెట్టడం సరికాదని, ఆ అవసరం లేదని సీఎం చంద్రబాబు ఆ ప్రతిపాదనను నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్ల కు కేబినెట్ ఓకే చెప్పింది.
ముఖ్యమంత్రి యువ నేస్తం
నిరుద్యోగ భృతి పథకానికి తన పేరు పెట్టేందుకు సిఎం చంద్రబాబు అంగీకరించకపోవడంతో...మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రుల సూచనలు క్రోడీకరించి చివరకు ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి యువ నేస్తం' అని నామకరణం చేశారు. ఈ పథకం అమలు విషయమై యుపి ఐఏఎస్ అధికారి రాజమౌళి మాట్లాడుతూ యూపీలో ఇటువంటి పథకం పెట్టినప్పుడు కొన్ని చోట్ల శాంతి భద్రతల పరిస్ధితి తలెత్తిందని ఈ సమావేశంలో వివరించారు. అయితే దీనిపై స్పందించిన లోకేష్ ఇక్కడ ఆ పరిస్థితి రాదని తెలిపారు.
సమస్య రాదు...ఎందుకంటే?....
యుపి ఐఏఎస్ అధికారి రాజమౌళి వ్యక్తం చేసిన సందేహంపై స్పందించిన ఐటి శాఖా మంత్రి నారా లోకేష్..."మన వద్ద వివరాలు సమగ్రంగా ఉన్నాయి. ఎవరు ఎక్కడ చదివారు.. వయసు ఎంత.. ఏ కుటుంబంలో ఎవరు ఉన్నారు.. ఎవరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు వంటి వివరాలన్నీ అందుబాటులో ఉన్నాయి"...అని వెల్లడించారు. అందువల్ల ఎపిలో ఈ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుఅయ్యే అవకాశం ఉండదన్నారు.
అమరావతి బాండ్లు...కేబినెట్ ఓకే
గురువారం జరిగిన ఎపి కేబినెట్ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి నగర నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.2,000 కోట్లను మదుపరుల నుంచి సేకరించే నిమిత్తం ఏపీ సీఆర్డీయే జారీ చేయదలచిన అమరావతి బాండ్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థికరంగ నిపుణులు, ఉన్నతాధికారులతో కూడిన ఒక స్టాండింగ్ కమిటీని కూడా ఈ సందర్భంగా నియమించారు.
త్వరలోనే బిడ్లు...ఆకర్షణీయ వడ్డీ...
రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీనిచ్చే ఈ బాండ్ల కోసం ఈ నెల ఆరు లేదా ఏడు తేదీల్లో బిడ్లను పిలుస్తారని, తర్వాత మూడు నాలుగు రోజుల్లో అవి బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో లిస్టవుతాయని తెలుస్తోంది. అమరావతి బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఆకర్షణీయమైన వడ్డీ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. వీటిపై 10.32 శాతం స్థిర వడ్డీని, ప్రతి మూడు నెలలకూ ఒకసారి మదుపరులకు చెల్లించేందుకు అంగీకరించడం ద్వారా వీటిపై పలువురు ఆసక్తి కనబరచేలా చూసింది. మొత్తం సేకరించదలచిన రూ.2,000 కోట్లకు తొలి దశలో (బేసిక్ ఇష్యూ) రూ.1300 కోట్ల విలువైన బాండ్లను బీఎ్సఈ ఎలక్ట్రాట్రనిక్ బిడ్డింగ్ ప్లాట్ఫాం (ఈబీపీ)పై జారీ చేయనున్నారు.
సీఆర్డీయేకు...ప్రయోజనాలు
అమరావతి బాండ్లు మదుపరులకు భద్రతతో కూడిన మంచి ఆదాయాన్ని ఇస్తూనే...వాటిని జారీ చేసే సీఆర్డీయేకూ ప్రయోజనాలను కలిగించనున్నాయి. బాండ్ల ద్వారా లభించే నిధులను అవసరాలు, ప్రాథాన్యతలకు అనుగుణంగా ఖర్చు చేసుకునే సౌలభ్యం సీఆర్డీయేకు ఉంటుంది. దీనివల్ల ఏమాత్రం కాలహరణం జరగదు. బాండ్ల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. ఆ వెంటనే నిధులు అందుతాయి. అమరావతి బాండ్లపై ఐదు సంవత్సరాల మారిటోరియం ఉంది. అంటే...2023 తర్వాత మాత్రమే మదుపరులకు రీపేమెంట్లు ప్రారంభమవుతాయి. ఇది సీఆర్డీయేకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తుంది. ఈ బాండ్ల జారీ ప్రక్రియ పర్యవేక్షణకు ఒక స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ సమావేశం ఆమోదించింది. రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు ఈ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు.