అమరావతిలో అపశృతి: కాంక్రీట్ మిల్లర్లో పడి కార్మికుడి మృతి, ఉద్రిక్తత
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.
తాజాగా సోమవారం రాత్రి అక్కడ పనుల వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ప్రమాదవశాత్తూ కాంక్రీట్ మిల్లర్లో పడి ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన దేవేందర్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే పనికి కుదిరిన దేవేందర్ మృత్యువాత అక్కడి కార్మికులను తీవ్ర ఆవేదనలోకి నెట్టేసింది. ఈ క్రమంలో తరచూ ఇలా కార్మికులు ప్రమాదవశాత్తూ మృతి చెందుతుండటంతో కార్మికులు ఆందోళనకు దిగారు.
శరవేగంగా సాగుతున్న తాత్కలిక సచివాలయం నిర్మాణ పనుల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకున్నాయని కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు. వాహనాలకు నిప్పుపెట్టిన కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వి వారి కోపాన్ని ప్రదర్శించారు.
కార్మికులు మృతి చెందడానికి యాజమాన్య నిర్లక్ష్యమేనంటూ కార్మికులు కోసం వేసిన షెడ్లు, గూడారాలను ధ్వంసం చేశారు. దీంతో వెలగపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో తాత్కాలిక సచివాలయ పనుల్లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. గతంలో కూడా ఇలానే పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు.
పిల్లర్ల గుంతలు తవ్వడానికి ఉపయోగించే రిగ్ యంత్రం ఆపరేటర్గా పనిచేస్తున్న పశ్చిమబెంగాల్కు చెందిన సమ్రాట్ రౌత్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తూ అదే యంత్రం కింద పడి మృతి చెందాడు. కాగా ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని షాపుర్జీ పల్లంజీ సంస్థతో పాటు ఎల్ అండ్ టీలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తాత్కాలిక సచివాలయంలో పనిచేసేందుకు కూలీలకు అవకాశం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి రైతుల ఉపాధికి భలే అవకాశం వచ్చింది. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాలలోని పనులు చేసుకునే జీవించే వారికి ఇప్పుడు సచివాలయంలో పని చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. తాత్కాలికి సచివాలయ నిర్మాణంలో పని చేయడానికి షిఫ్ట్కు రెండువందల మందిని ఎంపిక చేస్తున్నారు.
పని చేయడానికి ముందుకొచ్చే వారి వద్ద నుంచి ఆధార్, రేషన కార్డు, రెండు ఫోటోలను సేకరిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక షిఫ్ట్, సాయంత్రం 3 నుంచి రాత్రి రాత్రి 11 గంటల వరకు విధులను నిర్వహించనున్నారు. వీరికి రోజుకు దినసరి వేతనం రూ.220 ఇవ్వనున్నారు.
మధ్యాహ్న భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేస్తారు. ఉదయాన్నే బస్సులలో పనిచేసే ప్రదేశాలకు తీసుకు వెళతారు. మళ్లీ ఇంటి వద్ద దించేస్తారు. లైసెన్సు ఉన్న ఆటోల వారికి నెలకు పది వేల రూపాయల వేతనం ఇవ్వనున్నారు. ఆటోల వారు ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు కారియర్లును తీసుకు వెళ్లడం వంటి కార్యక్రమాలు అప్పచెప్పనున్నట్లు తెలిసింది.
కార్యాలయాలను పరిశుభ్రం చేయడం, కూరగాయలు తరగడం, ఇంకా ఇతరత్రా పనులు అప్పగించనున్నట్లు సమాచారం. రాజధాని పరిసర ప్రాంతాలోని డ్వాక్రా గ్రూపులు, ఇతరత్రా మహిళా గ్రూపుల వారి సభ్యులలో కొందరిని ఈ పనులకు పంపించడానికి సమాయత్తమవుతున్నారు.