సెక్స్వర్కర్లుగా మారుతుంది అందుకే!...భూమి ఇవ్వండి:స్వచ్చంద సంస్థల సూచన
అమరావతి: సెక్స్వర్కర్లకు పునరావాసం కోసం ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది యువతులు, బాలికలు వ్యభిచారకూపంలోకి దిగుతున్నారని పలువురు సామాజిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
మానవ అక్రమ రవాణాపై సోమవారం సచివాలయంలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత పర్యవేక్షణలో ఈ వర్క్ షాప్ నిర్వహణ జరిగింది. డీజీపీ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ ఈ సామాజిక సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సెక్స్ వర్కర్లను బాధితులుగానే చూస్తున్నామని కేసులు పెట్టడం లేదని ఆయన తెలిపారు.
హ్యూమన్ ట్రాఫికింగ్...వర్క్ షాప్
మానవ అక్రమ రవాణాపై సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో సోమవారం వర్క్ షాప్ జరిగింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వర్క్ షాప్లో సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్, కృష్ణా జిల్లా న్యాయమూర్తి పీఆర్ రాజు, విజయవాడ డీసీసీ బ్రహ్మారెడ్డి, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ రాజీవ్, సీఐడి విభాగం ప్రాంతీయ అధికారి మేరి ప్రశాంతి, డీఎస్పీలు సరిత, శ్రీలక్ష్మి, యుఎస్ కాన్స్లేట్కు చెందిన చందిల్, పద్మజ, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Recommended Video
సెక్స్ వర్కర్లుగా...ఎందుకంటే?
సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే చాలా మంది యువతులు, బాలికలు వ్యభిచారకూపంలోకి దిగుతున్నారని ఈ వర్క్ షాప్ లో ప్రసంగించిన పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. ఎక్కువ మంది పేద వర్గాలు, అణగదొక్కబడిన కులాల వారే ఇందులో చిక్కుకుంటున్నారన్నారు. అయితే కొందరు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడినవారు, తేలికగా డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో ఉన్నవారు కూడా ఈ వృత్తిలోకి దిగుతున్నారని విశ్లేషించారు. అయితే యువతులను మోసం చేసి, ప్రలోభ పెట్టి ఈ వృత్తిలోకి దింపేవారిపై, ముంబై, పూణె, గల్ఫ్ దేశాలకు పంపే వారిపై, అమ్మేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని వక్తలు చెప్పారు.
పునరావాసం...భూమి...సూచనలు
ఈ సందర్భంగా స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ అమాయకంగా తెలిసీతెలియక ఈ వృత్తిపట్ల ఆసక్తి చూపేవారికి అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. సెక్స్ వర్కర్లను, వుమన్ ట్రాఫికింగ్ను వేరువేరుగా చూడాలన్నారు. అలాగే సెక్స్ వర్కర్లపై దాడులు ఆపాలని, రిహాబిలేషన్ హోమ్స్ లేని ప్రాంతాల్లో వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. తండాల నుంచి యువతులను ముంబై, పూనే, గల్ఫ్ దేశాలకు పంపడాన్ని నిరోధించాలని, ఉజ్వల హోమ్స్ని మెరుగుపరచాలని, సెక్స్ వర్కర్ల పునరావాసం కోసం రెండు ఎకరాల భూమి ఇవ్వాలని, సెక్స్ వర్కర్లకు ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సూచించారు.
డిజిపి మాలకొండయ్య...ఏమన్నారంటే
డీజీపీ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ దీన్ని చాలా తీవ్రమైన సామాజిక సమస్యగా చూడాలని, తమవైపు నుంచి ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సెక్స్ వర్కర్లకు సంబంధించి స్వచ్చంద సంస్థల ప్రతినిధులు లేవనెత్తిన కొన్ని సమస్యలకు ఆయన పరిష్కార మార్గాలను చెప్పారు. కొన్ని సమస్యలను జిల్లా స్థాయిలోనే జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ, ఇతర శాఖల సమన్వయంతో పరిష్కరించుకోవచ్చని డిజిపి మాలకొండయ్య సూచించారు. సెక్స్ వర్కర్లపై దాడులు చేయడం ఆపివేశామని, ట్రాఫికింగ్ ని తాము వేరుగానే చూస్తున్నట్లు, దానికి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని, అయితే తాము సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టడంలేదని, వారిని బాధితులుగానే పరిగణిస్తున్నట్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న మరికొందరు పోలీస్ అధికారులు చెప్పారు.
హూస్టన్లో...విస్తృత ప్రచారం
మానవ అక్రమ రవాణకు వ్యతిరేకంగా హూస్టన్ లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హ్యూమన్ ట్రాఫికింగ్ పై అమెరికన్ నిపుణురాలు, హూస్టన్ అధికారి మినాల్ పటేల్ డేవిస్ చెప్పారు. సెక్స్ వర్కర్లు, మానవ అక్రమ రవాణాకు సంబంధించి హూస్టన్ లోని పరిస్థితులు, అక్కడ తీసుకుంటున్నచర్యలను ఆమె వర్క్ షాప్ లో వివరించారు. ఈ అంశానికి సబంధించి 1200 మంది ఆరోగ్య సిబ్బందికి తాము శిక్షణ ఇప్పించినట్లు ఆమె వివరించారు.