అమరావతికి మెలిక: ఆటంకాన్ని చంద్రబాబు అధిగమిస్తారా?
రాజధాని నిర్మాణానికి రుణం తీసుకోవాలన్న ప్రభుత్వ వ్యూహానికి ‘రైతు సమాఖ్య’ అడ్డు పడింది. పూర్తి వివరాలతో రైత సమాఖ్య పంపిన ‘ఈ - మెయిల్’లో పేర్కొన్న అభ్యంతరాలు పరిశీలించేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధమైంది.
హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 'అమరావతి' నిర్మాణానికి.. అక్కడ మౌలిక వసతుల కల్పనకు విరాళాలు సేకరించిన నేపథ్యం ఆ రాష్ట్ర ప్రభుత్వానిది. సింగపూర్, మలేషియా తదితర దేశాలకు చెందిన సంస్థలతో రకరకాల ఒప్పందాలు చేసుకున్న నేపథ్యం చంద్రబాబు ప్రభుత్వానిది.
స్విస్ చాలెంజ్ అనే పేరుతో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ల్యాండ్ పూలింగ్ తదితర పథకాల కింద ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 26 గ్రామాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 'ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు' భాగస్వామ్యంతో రూ.3221 కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1383 కోట్లు భరిస్తుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4606 కోట్లు. ఈ నిధులతో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, సమాచార వ్యవస్థలు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం గతంలో ప్రణాళికలు రచించింది.
అమరావతి ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణానికి సాంకేతిక సహకారం, వ్యూహాత్మక మదింపు వంటి సాయం చేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. కానీ రాజధాని నిర్మాణానికి రుణం తీసుకోవాలన్న ప్రభుత్వ వ్యూహానికి 'రైతు సమాఖ్య' అడ్డు పడింది. పూర్తి వివరాలతో రైత సమాఖ్య పంపిన 'ఈ - మెయిల్'లో పేర్కొన్న అభ్యంతరాలు పరిశీలించేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధమైంది.
ప్రపంచ బ్యాంకుకు ఇలా రైతుల లేఖ
వచ్చే అక్టోబర్ 5న జరిగే ప్రపంచబ్యాంకు కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి నగరానికి రుణం మంజూరుపై తుది నిర్ణయం తీసుకోనున్నది. అసలు విషయం ఏమిటంటే... రుణం కోసం రాష్ట్ర పభ్రుత్వం ప్రపంచ బ్యాంకుతో జరుపుతున్న చర్చలు ప్రాథమిక దశలో ఉండగానే దీనిని అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని విమర్శలు వచ్చాయి. 2016 డిసెంబర్లో ముగ్గురు రైతులు బ్యాంకుకు లేఖ రాశారు. ‘భూసమీకరణ చట్ట విరుద్ధం. దాని వల్ల రైతులకు అన్యాయం. భూములు ఇవ్వని వారిని బెదిరించారు. పంటలు తగలపెట్టారు' అని ఇలా పలు ఆరోపణలు చేశారు. అప్పట్లో రుణ మంజూరుపై సంప్రదింపులు ప్రాథమిక స్థాయిలో ఉండటంతో ఫిర్యాదును ప్రపంచ బ్యాంకు పక్కనబెట్టింది.
22 పేజీలతో రైతుల ఈ - మెయిల్స్ ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి రుణం అందించే దిశగా ప్రపంచ బ్యాంక్ తదుపరి అడుగులు వేయడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన విధాన ప్రక్రియ జరుగుతుండగానే మరోసారి ప్రపంచ బ్యాంక్కు ఫిర్యాదు అందింది. ఈ ఏడాది మే 25వ తేదీన ‘రాజధాని రైతుల' పేరిట ముగ్గురు వ్యక్తులు 22 పేజీలతో ఈ - మెయిల్ పంపారు. ఇందులో తెలుగు పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లూ జత చేశారు. దీనికి మద్దతు పలుకుతూ ‘1600 మంది సభ్యులు ఉన్న స్థానిక రైతు సమాఖ్య' పేరిట మరో లేఖ పంపారు.
ప్రభుత్వం తీరుపై రైతు సమాఖ్య ఇలా
‘ల్యాండ్ పూలింగ్లో మాకు అన్యాయం జరుగుతోంది. సరిగా పునరావాస పరిహారం ఇవ్వలేదు. సంప్రదింపుల్లో అన్యాయం జరిగింది. రాజధాని వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. కొండవీడు వాగు ముంచెత్తుతుంది. లంక భూముల్లో 600 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దళితులు నిరాశ్రయులు అవుతారు' అని ఇలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘రుణం ఇస్తే అంతే సంగతులు' అని భయపెట్టే స్థాయిలో రకరకాల అంశాలు పొందుపరిచారని మీడియాలో ఒక వార్తాకథనం ప్రచురితమైంది. ఈసారి ప్రపంచబ్యాంక్ దీనిపై దృష్టి సారించింది. రైతుల అభ్యంతరాలను పరిశీలించాలని ప్రపంచ బ్యాంకు తనిఖీల బృందం తాజాగా నిర్ణయం తీసుకున్నది.
ల్యాండ్ పూలింగ్ పేరిట బలవంతంగా భూసేకరణ
రైతు సమాఖ్య పేరిట కొందరు ప్రతినిధులు ఈ - మెయిల్ పంపి ఉండవచ్చు. కానీ ల్యాండ్ పూలింగ్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం రైతుల బలవంతంగా భూసేకరణ చేసిన మాట మాత్రం అబద్దం మాత్రం కాదు. రైతులతో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరుపకుండానే భూములు స్వాధీనం చేసుకున్నారు. భూమి స్వాధీనం చేసేందుకు సిద్ధంగా లేని రైతుల పంట భూముల్లో సాగు చేసిన అరటి తోటలకు చీకటి మాటున నిప్పు బెట్టిన సంగతి కూడా ఒక చేదు నిజం. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ తోపాటు పోరుగు రాష్ట్రం తెలంగాణ వాసులకూ తెలుసు. పునరావాసం చెల్లించాలని ఆందోళనకు దిగిన వారిపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు రాజధాని ప్రాంతం భూకంప ప్రభావ ప్రాంతం అని శాస్త్రీయ ఆధారాలు చెప్తున్నాయి.
అమరావతిలో ప్రత్యక్ష తనిఖీలకు ప్లాన్
లంక భూముల్లో వివిధ రకాల పంటలు, కూరగాయలు పండిస్తూ కుటుంబ జీవనం సాగిస్తున్న దళితులు, పేదల కుటుంబాలను ‘రాజధాని నగర నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోలుకోలేని దెబ్బ తీసిందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తి చేయాల్సిందే. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజాభిమతానికి వీలుగా చేపట్టాలే గానీ ప్రజలపై బలవంతంగా రుద్దడానికి కాదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
అమరావతి వెళ్లి ప్రత్యక్షంగా తనిఖీలు చేయడానికి అనుమతివ్వాలని ప్యానెల్ చైర్మెన్ గోంజాలో క్యాస్ట్రో దేలామాట ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్కు ఈనెల 12వ తేదీన లేఖ రాశారు. ‘చాలా సార్లు ప్రపంచ బ్యాంకును అశ్రయించినా, తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. అభ్యంతరాలను పరిష్కరించడంలో బ్యాంకు యాజమన్యం విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. తనిఖీల అంశంపై 21 పనిదినాల్లో అంటే వచ్చేనెల 13 లోపు అభిప్రాయం చెప్పండని బ్యాంకు చైర్మన్ను కోరారు.
ప్రపంచ బ్యాంకు నిబంధనలకు భిన్నంగా రుణం లభిస్తుందా?
అమరావతిపై ఫిర్యాదు చేసిన వారు ‘మా పేర్లు బయటపెట్ట వద్దు' అని ప్రపంచ బ్యాంకు తనిఖీల ప్యానెల్ను కోరారని ఒకవర్గం మీడియాలో వార్తలు వచ్చాయి. తమ వివరాలు బయటికి వస్తే ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉన్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉత్తర ప్రత్యుత్తరాలను వారి పేర్లు లేకుండానే జరిపారు. 1600 మంది మద్దతు ఉందంటున్న రైతు సమాఖ్య గురించిన వివరాలనూ గోప్యంగానే ఉంచారు. రాజధానిపై ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ అది ప్రపంచ బ్యాంకు విధానాల్లో దేని పరిధిలోకి వస్తుంది, అంతర్జాతీయంగా దీనికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలున్నాయన్న వివరాలన్నీ ఫిర్యాదుల్లో పొందుపరచడం విశేషం. ‘మీ విధానాలకు విరుద్ధంగా ఉన్న ప్రాజెక్టుకు మీరే ఎలా రుణం ఇస్తారు' ప్రతి దశలోనూ ప్రశ్నించే ప్రయత్నం చేశారు.
ప్రశ్నార్థకం కానున్న ఆహార భద్రత
ల్యాండ్ పూలింగ్లో భూమిలివ్వని రైతులపై భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించింది. రాజధాని నిర్మాణంపై కొండవీటి వాగు ప్రభావం పడుతుంది. తద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. భూ సమీకరణ జరిపిన ప్రాంతంలో 120 రకాల పంటలు పండుతాయి. ఇలాంటి భూముల్లో రాజదాని నిర్మాణం వల్ల ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. లంక భూములను కూడా స్వాధీనం చేసుకుని, నిర్మాణాలు చేపడుతున్నారు. దీనివల్ల జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. కృష్ణా నదిలోకి 13 లంక భూములను 500 మంది దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. గత 600 ఏళ్లుగా వారు ఇలా జీవనోపాధి పొందుతున్నారు. వారంతా నిరాశ్రయులవుతారు. ఈ ప్రాంతంపై భూకంప ప్రభావం కూడా ఉన్నదని రైతులు, నిపుణులు చెప్తున్నారు.