కడప వెలుగు కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు అధికారుల తనిఖీ
కడప:కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం వెలుగు కార్యాలయంలో సోమవారం ఉదయం వరల్డ్ బ్యాంకు అధికారులు తనిఖీలు జరిపారు. అనంతరం మండల సమాఖ్యల స్థితిగతులపై అరా తీశారు.
లక్కిరెడ్డిపల్లె మండలం పరిధిలో ఎన్ని సంఘలు ఉన్నాయి, ఎన్ని సంఘాలకు రుణాలు అందించారు, సంఘంలో ఉన్న సభ్యుల కుటుంబ స్థితిగతులు, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందారా, లేదా అనే వాటిపై ప్రపంచ బ్యాంకు అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ద్వారా మహిళలకు రుణాలు మంజూరు అవుతాయని దీనిలో లక్కిరెడ్డిపల్లెను ఎందుకు ఎంపిక చేయలేదని వారు వెలుగు అధికారులను ప్రశ్నించారు.
ప్రభుత్వం అందిస్తున్న పధకాలను ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారని వరల్డ్ వ్యాంకు అధికారులు అడిగి తెలుసుకున్నారు. సాధికారిక మిత్రుల బృందం పని తీరు చాలా బాగుందని ఈ సందర్భంగా ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో సాధికారిక మిత్రల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరుపై తనిఖీలు జరుపుతున్న ప్రపంచ బ్యాంకు తాజాగా కడప జిల్లాలో పరిశీలించింది. ఈ తనిఖీ కార్యక్రమంలో వరల్డ్ బ్యాంకు అధికారులు రవీంద్ర సింగ్, ఉమా, గౌడ్, విజయలక్ష్మి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ నెలలో వెలుగు ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎపి ఆర్ఐ జిపి అమలు తీరును చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లి మండలంలో ప్రపంచ బ్యాంకు బృందం, అధికారులు పరిశీలించారు. సన్న, చిన్నకారు రైతుల సంఘాలు ఏర్పాటు వాటి పనితీరు, వారు పండించిన పంటలకు ఉత్పత్తులకు మార్కెటింగ్కు అధికారులు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు అనే అంశాలపై రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.