ఎపి:రాజధానికి వరల్డ్ బ్యాంకు ప్రతినిథుల రాక...రుణ మంజూరుపై ఈసారైనా తేలేనా?
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ.7300 కోట్లు రుణం ఇవ్వాలంటూ సీఆర్డీయే ధరఖాస్తు నేపథ్యంలో...లోన్ మంజూరు ప్రక్రియలో భాగమైన ఫీల్డ్ విజిట్ నిమిత్తం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం మరోసారి అమరావతికి విచ్చేసింది.
సోమవారానికే విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి చేరుకున్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిథుల బృందం మంగళవారం నుంచి తమ పని ప్రారంభించారు. మొత్తం నాలుగు రోజుల ఈ పర్యటనలో వారు తొలి రోజున సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ప్రపంచ బ్యాంకు బృందం ఇదే విషయమై గతంలో కూడా పలుమార్లు విచ్చేయడం గమనార్హం.
వరల్డ్ బ్యాంక్ బృందం...భేటీ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరం నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకును సీఆర్డీయే రుణం రూపంలో రూ.7300 కోట్లు అడిగింది. దీంతో ఈ లోన్ మంజూరుకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలు, విధివిధానాలపై వరల్డ్ బ్యాంకు-సిఆర్డీఏ ప్రతినిథుల మధ్య విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు మరోసారి అమరావతికి విచ్చేశారు.
దేశం, ప్రపంచం ప్రేమించేలా: కోహ్లీ ట్వీట్ పైన స్పందించిన బాబు
ఈ దఫా...కీలకం
ఇప్పటికే ఇదే విషయమై పలు పర్యాయాలు సిఆర్డీఏతో చర్చించిన ప్రపంచ బ్యాంక్ బృందాలు తాజా పర్యటనలో ఈ రుణ మంజూరు అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని సమీక్షించడం...సీఆర్డీయే నుంచి తమకు లభించాల్సిన స్పష్టత విషయమై ఈ పర్యటనలోనే దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.
ఆ చర్యలు...ఆరా
ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ నిబంధనలను అనుసరించి రాజధానిలోని ప్రాధాన్య రహదారుల నిర్మాణం, అలాగే వరద నియంత్రణ ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యే వివిధ వర్గాల ప్రజలకు కల్పించే పునరావాసం, సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన, అలాగే లింగవివక్షకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలు తదిదర అంశాలపై కూడా వరల్డ్ బ్యాంకు-సిఆర్డీఏ ప్రతినిథుల మధ్య చర్చ జరిగిందని తెలిసింది.
ఫిర్యాదులపై...ప్రత్యేక దృష్టి
అంతేకాకుండా ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రభావిత గ్రామాల ప్రజల ఫిర్యాదులు...వాటి పరిష్కారం ఎలా ఉన్నాయనేది కూడా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సీఆర్డీయే ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ బృందం మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించి, అందులోని ప్రాజెక్ట్ల ప్రభావిత వర్గాలను కలుసుకోవటం జరిగింది.