సింహాద్రి అప్పన్న లడ్డూలో పురుగులు: ఆందోళనకు దిగిన భక్తులు
విశాఖపట్నం: గురు పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని సింహాచలంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ఆలయ అర్చకులు ఆఖరి విడత చందనం సమర్పణ చేశారు.
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షణ పూర్తి చేసుకున్న భక్తులు అప్పన్న దర్శనం కోసం బారులు తీరారు. సుమారు 3 లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఎర్పడింది.
ఇది ఇలా ఉంటే సింహాచలం అప్పన్న ప్రసాదంలో పురుగులు బయటపడ్డాయి. గుడిలో గిరిప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు స్వామి వారి ప్రసాదం లడ్డూలు తీసుకున్నారు. లడ్డూలను విప్పిచూడగా పురుగులు వెలుగు చూడటంతో భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలయ భక్తులను వివరణ కోరారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రసాదం తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, లడ్డూలను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే పంపిణీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
లడ్డూలో పురుగులు వెలుగు చూడటంతో భక్తులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.