పెరుగుతున్న మూఢ నమ్మకాలు ... కరోనా రాదని చిత్తూరు జిల్లాలో సామూహిక పూజలు
కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉన్నా కరోనా వైరస్ నేపధ్యంలో మూఢనమ్మకాలు మాత్రం జోరుగా పెరుగుతున్నాయి. గ్రామాలు ,పట్టణాలు అన్న తేడా లేకుండా మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక కరోనా రాకుండా ఉండాలంటే ఎలా అని ఆలోచిస్తున్న జనాలకు ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పే వాళ్ళు బాగా పెరిగిపోయారు. పూజలు చెయ్యటం , వేప చెట్టుకు నీళ్ళు పోయటం, గుండ్లు గీయించుకోవటం వంటి ఉదంతాలు బాగా పెరిగాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇక ఇప్పుడు ఇలాంటి ఘటనలు కూడా అధికారులకు ఇబ్బందిగా మారాయి .
తిరుమలలో పాముల హల్చల్ ... సర్ప సంచారం అరిష్టం అంటున్న స్థానికులు
చిత్తూరు జిల్లాలో మూఢ నమ్మకాలు
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం కొండసముద్రం గ్రామంలో గ్రామస్థులు కరోనా పూజలు నిర్వహించారు. రాళ్లపై బొమ్మలు చిత్రీకరించి పూజలు చేశారు. గ్రామంలోకి వైరస్ రావొద్దంటూ పూజలు చేసి మరీ మొక్కుకున్నారు. కరోనా ప్రభావం చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉండటంతో భయపడుతున్న జనాలు ఈ తరహా పూజలు చేస్తే ఊళ్ళోకి కరోనా రాదనీ భావించి రాళ్ళమీద పసుపుతో బొమ్మలు వేసి వాటికి పూజలు చేశారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో చిత్తూరు జిల్లాను రెడ్జోన్గా ప్రకటించారు. దీంతో గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలైంది.
కొండ సముద్రంలో రాత్రి వేళ సామూహిక పూజలు
పూజలు చేస్తే కరోనా వైరస్ దరిచేరదనే నమ్మకంతో కొండ సముద్రంలో రాత్రి వేళ సామూహిక పూజలు చేశారు . అయితే అందరూ ఒక్కచోట గుమిగూడటంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇది తెలిసిన అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలకు స్వస్తి పలికి సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లకే పరిమితం అవ్వమని ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఆగని ప్రచారాలు .. అధికారులకు తలనొప్పులు
సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక మూఢ నమ్మకాలను విశ్వసించే ప్రజలు ఇలాంటి వాటిని ఠక్కున నమ్ముతున్నారు . ఇక మరోపక్క ప్రభుత్వాలు ఫేక్ వార్తలకు చెక్ పెట్టడానికి ఫ్యాక్ట్ చెక్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ప్రజలు తప్పుడు సమాచారాన్నే ఎక్కువగా నమ్ముతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది . ఒకవైపు అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు, వైద్యులు, ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది. అయినా రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మూఢనమ్మకాల ప్రచారం, వాటిని నమ్మి జనాలు చేస్తున్న పనులు ఇప్పుడు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి.
Recommended Video