బీజేపీ బలపడాలంటే ఇంత దిగజారాలా..? మొన్న సుజనా , సీఎం రమేష్.. నిన్న కోటి చేరిక
అమరావతి/హైదరాబాద్ : గత ఎన్నికల్లో నోటాకు గట్టి పోటీ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఏపీలో బలపడేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన నేతలను ఇబ్బడి ముబ్బడిగా కమలం తనలో కలిపేసుకుంటోంది. రాజైనా, రసికుడైనా, రెడ్డైనా, గడ్డితినే వాడైనా ఎవరిని వదిలిపెట్టకుండా బీజేపి నేతలు కండువా కప్పేస్తున్నారు.
కేంద్రంలో సంపూర్ణ ఆదిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంత కక్కుర్తి రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం ఏముందనే చర్చ జరుగుతోంది. ఆర్ధిక నేరస్తుల దగ్గరనుండి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ల వరకూ అందరిని చేర్చుకుని మేం బలపడుతున్నామనే భ్రమలో బీజేపి కాలం వెళ్లదీస్తున్నట్టు కనిపిస్తోందనే చర్చ తారా స్థాయిలో జరుగుతోంది.
ఏపిలో బీజేపి వింత చేష్టలు..! బలోపైతం మాటున బోర్లాపడుతున్న పార్టీ..!!
బ్రహ్మ చిత్రాన్ని గీయ బోతే మరో వింత చిత్రం ఆవిష్కృతం అయ్యిందట. ఏదో చెయ్య బోతే ఇంకేదో చేసినట్టుగా ఉందట ఏపీలో బీజేపీ పరిస్థితి. ఎవరో వస్తుంటారు.. వచ్చేదెవరో తెలీదు.. కానీ కాషాయకండువా కప్పేసి.. చూశారా బీజేపీ బలపడుతోందంటూ సంబరపడిపోతున్నారు. ఏ వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటే ఓటు బ్యాంకు వస్తుందనే అంచనాలు వేసుకునే పనిలో పడ్డారు. కోస్తాలో కమ్మ.. ఉత్తరాంధ్రలో కాపులు(బీసీలు).. సీమలో రెడ్లను ఒక్కొక్క కులానికి ప్రాంతం వారీగా రండిబాబూ రండి అంటూ కమల దారులు తెరిచింది. ఇంతలో ఏమైందో.. పాపం.. లక్ష్మీపార్వతిని తనను లైంగికంగా వేధిస్తుందంటూ ఆరోపణలు చేసి వాట్సప్ సందేశాలను పోలీసులకు సమర్పించిన ది గ్రేట్ కోటికి కూడా కాషాయ కండువా కప్పేశారు.
ఆర్థిక నేరగాళ్ల నుండి అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తుల వరకూ స్వాగతం..! ఇదే వింత ఆచారం..!!
తర్వాత తప్పని తెలిసి నాలుక కరుచుకుని తూచ్ అంటూ.. కన్నా లక్ష్మినారాయణ ట్వీట్టాల్సి వచ్చింది. ఏమైనా.. కమలం మాంచి ఊపు మీదుందనే మాట నిజమే. తమకు కావాల్సింది నాయకులా.. ఓట్లా అనేదానిపై మాత్రం క్లారిటీకి రాలేక నానా అగచాట్లు పడుతున్నారు. అదిష్ఠానం నుంచి కన్నా లక్ష్మినారాయణకు ఏమని ఆదేశించారో తెలియదు కానీ.. తాను మాత్రం ఇదే మాంచి సమయం అంటూ దూకుడు పెంచారు. అయితే.. ఏపీలో బీజేపీ బలం ఏపాటిది అనేది జగమెరిగిన సత్యం. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు తమకంటూ బలాబలాలున్నాయి.
ఏపిలో ఉనికి కోసం పాకులాట..! నేతల కోసం బీజేపి వెతుకులాట..!!
కులాల వారీగా ఎవరికి తగ్గట్టుగా ఓటుబ్యాంకు ఉంది. ఇటువంటి సమయంలో బీజేపీ ఐదేళ్లలో తమకంటూ కేడర్ను ఎలా ఏర్పరచుకుంటుందనేది ఓ సందేహం. కాదంటే.. జనసేనతో పొత్తు పెట్టుకోవాలి. అయితే ఆ పొత్తును ఏపీ ప్రజలు.. జనసైనికులు ఎలా స్వీకరిస్తారనేది మరో అనుమానం. అలాకాదు.. నేతలు వస్తే చాలనుకుంటే.. టీడీపీ కూడా 2019 ఎన్నికల్లో సీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ.. టీడీపీ నేతలంటే మండిపడే కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం పలికింది. కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యభాస్కరరెడ్డి, పరిటాల అండ్ జేసీ బ్రదర్స్ వంటి వైరివర్గాలను ఏకతాటిపైకి తెచ్చి కొత్త ప్రయోగం చేశారు.
రాబోవు ఎన్నకలే లక్ష్యం..! ఇలాంటి నేతలైతే కష్టం..!!
కానీ నాయకులు కలసినంత మాత్రాన మేం కలవాలని ఉందా! అన్నట్టుగానే కార్యకర్తలు మాత్రం కలవకుండా మిగిలారు. నేతలను ఓడించి తమ పంతం నెరవేర్చుకున్నారు. కాబట్టి.. బీజేపీ ఇటువంటి వికటించే ప్రయోగం చేసి చికాకులు కొని తెచ్చుకునే సాహసం చేయదు. ఇవన్నీ పక్కనబెడితే.. ఏపీ ప్రజల్లో టీడీపీ నాటిన బీజేపీ వ్యతిరేక భావనలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే అక్కసు ఉండనే ఉంది. వీటన్నింటినీ అధిగమించి కమలం 2024లో వికసించాలని ఆశపడటం నిజంగా భంగపాటే అంటున్నాయి రాజకీయ విశ్లేషణలు.