పాము ఇంట్లోకి ప్రవేశంతో ముందు పరేషాన్...ఆ తరువాత ఆపరేషన్
ఏలూరు:మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు...కుక్కని మనిషి కరిస్తే అదీ వార్త అనే పాఠం జర్నలిజం బేసిక్ సూత్రంగా జర్నలిజం పాఠ్యాంశాల్లో పేర్కొంటారు. అచ్చంగా ఇలాంటిదే కాకపోయినా దీనికి కొంత సారూప్యంగా చోటుచేసుకున్న ఘటన ఇది.
మన జనావాసాల్లో పాము కనబడితే కొట్టి చంపండం ఇక్కడ సర్వసాధారణంగా జరిగేదే. అయితే ఇక్కడ కూడా మొదట జనాలు కామన్ గానే స్పందించినా ఆ తరువాత ఓ పశువైద్యుడి స్పందన మాత్రం అందుకు భిన్నంగా ఉండి ఆయన్ని వార్తల్లోకి ఎక్కేలా చేసింది. ఇంతకీ జరిగినదేమిటంటే?...
పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఇంట్లోకి తాచు పాము ప్రవేశించింది. దీంతో భయపడిన ఆ ఇంట్లో వాళ్లు ముందు స్నేక్ సొసైటీకే సమాచారం ఇచ్చారు. అయితే ఆ ప్రమాదకరమైన పాము ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుండటం, ఈ లోపు ఆ పాముని కొట్టేందుకు ఒకరు ముందుకు రావడంతో ఆ పాముని రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ రాళ్ల దెబ్బలకు పాము తీవ్రంగా గాయపడింది.
అయితే ఇంతలోనే స్నేక్ సొసైటీ వాళ్లు అక్కడకు రావడంతో ఆ పాము కి చావు తప్పింది. వారు పాముని చంపకుండా అడ్డుకోవడంతో పాటు తీవ్రంగా గాయపడిన ఆ పామును చికిత్స నిమిత్తం ఒక వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నడుంకి తీవ్ర గాయమై అల్లాడుతున్న ఆ పాముకు అక్కడి పశువైద్యుడు చికిత్స చేశాడు. ఆ తాచుపాము నడుముకు ఆపరేషన్ చేసిన స్థానిక డాక్టర్ 8 కుట్లు వేశారు. ఆ విధంగా ప్రాణాలు నిలిపి పునర్జన్మ ప్రసాదించాడు. ప్రస్తుతం ఆ పాము స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో కోలుకుంటోంది.