ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్
హైదరాబాద్: గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు దేశానికి చాలా అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కుస్తీ, కర్రసాము వంటి దేశీయ యుద్ధ విద్యలను ప్రోత్సహించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పారు. అవినీతిపై పోరాటం చేయడానికి శారీరక దారుఢ్యం కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేనప్పుడే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రౌడీలు, అవినీతిపరులకు బుద్ధి చెప్పడానికి దేహధారుడ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు.
డేంజరస్ మౌంట్ కిలిమంజారోపై జెండా పాతిన అనంతపురం బాలిక: తెలంగాణలో ట్రైనింగ్
Recommended Video
పవన్ను కలిసిన మల్లయోధులు
ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధులు ఈ మధ్యాహ్నం హైదరాబాద్లో పవన్ కల్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని సన్మానించారు. వారికి శాలువా కప్పి, హనుమంతుడి వెండి, గదను బహూకరించారు. కోడి రామ్మూర్తి గొప్పతనం గురించి వారికి వివరించారు. తన పాత జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు. వారంతా క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రంలో నటిస్తోన్నారు.
చీరాలలో దగ్గరుండి చూశా..
భవిష్యత్తులో ప్రతి గ్రామం నుంచీ మల్లయోధులు పుట్టుకుని రావాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బలమైన సమాజం నిర్మాణానికి వారే పునాదులవుతారని చెప్పారు. తన చిన్నప్పుడు చీరాలలో ప్రాచీన యుద్ధ విద్యాలను నేర్చుకున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. తన తండ్రి చీరాలలో కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారని, పహిల్వాన్ అప్పారావు వంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూశానని చెప్పారు. కుస్తీ పోటీలను నేర్చుకోవాలనే తపన ఉన్నప్పటికీ.. తన శరీరం సహకరించేది కాదని అన్నారు. కోడి రామ్మూర్తి నాయుడులా దేహ ధారుడ్యాన్ని సాధించాలనే కోరిక ఉండేదని, అది తీరలేదని అన్నారు.
ప్రాచీన యుద్ధ విద్యలకు పెట్టింది పేరు..
భారత్.. ప్రాచీన యుద్ధ విద్యలకు పెట్టింది పేరని పవన్ కల్యాణ్ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా వాటికి ఆదరణ లభించట్లేదని, ఫలితంగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయని అన్నారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రాచీన యుద్ధ విద్యలు ఇంకా సజీవంగా ఉందని చెప్పారు. తాను మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందే సమయంలో కుస్తీ, మల్లయుద్ధంపై కొంత సాధన చేశానని, కిక్ బాక్సింగ్, కరాటే, ఇండోనేషియా మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం పొందానని పవన్ కల్యాణ్ వివరించారు.
తమ ప్రభుత్వంలో..
జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రాచీన యుద్ధ విద్యలను ప్రోత్సహిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. మానసికంగా బలంగా ఉండటం ఒక్కటే సరిపోదని, శారీరకంగా, దేహధారుడ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే ఎలాంటి సమస్యలపైనా ఎదుర్కొనడానికి ధైర్యం వస్తుందని అన్నారు. ప్రత్యేకించి- తెలుగు ప్రజలు గురుపరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలను ప్రోత్సహించాలని అన్నారు. యుద్ధ విద్యలను ప్రోత్సహించమని, పిల్లలకు కూడా నేర్పించాలని పార్టీ నాయకులు, జన సైనికులకు పవన్ కల్యాణ్ సూచించారు.