మాటల యుద్ధం... అలా చేయడం సరికాదు: తెలంగాణకు బాబు
విజయవాడ: కృష్ణా నది నీళ్ల వివాదంపై తెలంగాణ, ఏపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కృష్ణా నది జలాల పైన కేంద్రానికి ఏపీ లేఖ రాయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తప్పుబట్టింది. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం ఏమాత్రం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా రివర్ బోర్డు అధికార పరిధి గురించి చంద్రబాబు కేంద్రమంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కృష్ణా రివర్ బోర్డుకు అధికార పరిధి నిర్ణయించనందున, రెండు రాష్ట్రాలకు నష్టం కలుగుతోందన్నారు.
తొమ్మిదో షెడ్యూల్లోని కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలను అమలు చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకోవచ్చునని ఆయన తెలిపారు. బోర్డుకు అధికార పరిధి నిర్ణయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు.
కేంద్రం అండతో విర్రవీగొద్దు, మాతో పెట్టుకుంటే..: ఏపీకి తుమ్మల హెచ్చరిక
కాగా, అంతకుముందు టిఆర్ఎస్ నేతలు, తెలంగాణ మంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తమ ప్రాజెక్టులను కుట్రతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, తాము కట్టే ప్రాజెక్టులు ఉమ్మడి ఏపీలో ప్రారంభించినవేనని చెప్పారు. ఏపీ మంత్రి దేవినేని మహేశ్వర రావు, తెలంగాణ మంత్రి హరీష్ రావుల మధ్య కూడా ప్రాజెక్టులపై మాటల యుద్ధం నడిచింది.
నవ నిర్మాణ దీక్షలో...
సోమవారం నవనిర్మాణ దీక్షలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేశామన్నారు. వ్యవసాయ రంగ ఆధారిత పరిశ్రమలు ఇంకా రావాలన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగంలో అభివృద్ధి జరగాలని, సంపద ఎంత పెంచితే ఆదాయం అంత పెరుగుతుందన్నారు.
గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేవారిని ప్రోత్సహిస్తున్నామని, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. వ్యాపార దృష్టితో ఆలోచించి కొత్త ప్రణాళిక వేయాలన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని బాధ్యత తీసుకున్నామని చెప్పారు.
ఆగస్టు 15 నుంచి చంద్రన్న బీమా పథకం తీసుకొస్తున్నామని, డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా కష్టపడే తత్వం ఉండాలని చెప్పారు. ప్రపంచాన్ని జయించే శక్తి మన యువతకు ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధితో ముందుకు వెళ్లాలన్నారు.
వాణిజ్య పరంగా అమరావతికి గొప్ప చరిత్ర ఉందన్నారు. రెండువేల సంవత్సరాల క్రితం అమరావతి నుంచి ఎగుమతులు, దిగుమతులు జరిగాయన్నారు. అమరావతిని లాజిస్టిక్ హబ్గా మారుస్తామని చెప్పారు.
విమానాశ్రయాలు, పోర్టులు నిర్మిస్తే పరిశ్రమలు వస్తాయన్నారు. యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. పరిశ్రమలకు 14 రోజుల్లో ఆన్లైన్లో అనుమతులు ఇస్తామని చెప్పారు. పరిశ్రమలకు రూ.2500 కోట్ల రాయితీలు ఇచ్చామన్నారు.
అంతకుముందు, మహాసంకల్ప సభపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలిపామన్నారు. మహాసంకల్పంలో నిర్ధిష్టమైన లక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించాలన్నదే సంకల్పమన్నారు.
ఉన్న వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నామని చెప్పారు. అధికారులు పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులను తొలగించాలని, వారి స్థానంలో వెంటనే నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.