సభాపతికి లేఖ రాయడం సంప్రదాయం కాదు...కేవీపీపై మండిపడిన స్పీకర్ కోడెల
గుంటూరు:పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తనకు లేఖ రాయడంపై ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు.
జూలై 31న రైతులతో కలిసి పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించి టిడిపి ప్రభుత్వం హయాంలో చేసిన పనులను ప్రస్తుతించారు. దీనిపై కోడెల అసత్యాలు మాట్లాడుతున్నారంటూ ఎంపి కేవీపీ ఆయనకు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ పై వ్యాఖ్యల విషయమై కెవిపి తనకు లేఖ రాయడాన్ని స్పీకర్ కోడెల తప్పుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిగా గౌరవనీయమైన స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాతిని తప్పుదోవ పట్టిస్తారని కనీసం కలలో కూడా ఎవరూ అనుకోరంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోడెలకు కెవిపి ఓ లేఖ రాయడం తెలిసిందే.
ఈ లేఖపై స్పీకర్ కోడెల ఘాటుగా స్పందించారు. గుంటూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో స్పీకర్ కోడెల మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. కేవీపీ కంటే తనకు రాజకీయ అనుభవం ఎక్కువని, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం తనకు ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 57 శాతం పూర్తయిందని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కెవిపికి సూచించారు.
ప్రాజెక్ట్ విషయమై ఈ ప్రభుత్వం రాక ముందు 2 శాతం పనులు మాత్రమే జరిగాయని తాను చెప్పానని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రూ.5,136 కోట్లు పోలవరానికి ఖర్చు చేసినట్లు చూపించారని, ఇందులో హెడ్ వర్క్స్ కోసం ఖర్చు చేసింది కేవలం రూ.179 కోట్లేనని సభాపతి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కేవలం మట్టి పనులు చేసి మిగతా డబ్బులు తీసుకున్నారని కోడెల ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వంలోనే పోలవరం, పట్టిసీమ పాజెక్టులు సాకారమవుతున్నాయని స్పీకర్ కోడెల చెప్పారు. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం పనులకు ఎంపి కేవీపీ అడ్డుతగలడం భావ్యం కాదన్నారు. సభాపతికి లేఖ రాయడం, ఫిర్యాదులు చేయడం సంప్రదాయం కాదని కెవిపికి సూచించారు. ప్రతి అంశాన్నీ రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ దుర్యోధనుడైతే, కేవీపీ శకుని లాంటి వారని సభాపతి కోడెల వ్యాఖ్యానించారు.