100మంది పోలీసులు, మూడంచెల భద్రత: పాదయాత్రలో జగన్కు భారీ సెక్యూరిటీ
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు భారీ భద్రత ఇచ్చారు. ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేయడంతో ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఎక్కడ పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు.
Recommended Video
విశాఖలో దాడి నేపథ్యంలో జగన్కు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వందమంది పోలీసులతో జగన్కు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. జగన్ వెంట పాదయాత్ర చేసే నాయకులకు ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు ఐడీ కార్డులను పోలీసులు జారీ చేశారు. జగన్ వెంట నడిచే వారు తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
వైయస్ తప్పే బాబు చేస్తున్నారు, తెలంగాణలో పోటీపై డైలమాలో.. క్లారిటీ ఇస్తా: పవన్ కళ్యాణ్
జగన్కు మూడంచెల భద్రత
వైయస్ జగన్ను కలిసేందుకు కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. మూడంచెల భద్రతలో భాగంగా ముందస్తు అనుమతిలేనిదే రోప్ పార్టీ వలయం దాడి లోపలకు ఎవరినీ అనుమతించరు. లోపలకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. గత నెలలో దాడి అనంతరం జగన్ పాదయాత్ర 17 రోజుల పాటు నిలిచిపోయింది. నాడు విజయనగరం జిల్లాలోని మేలపువలసలో పాదయాత్ర నిలిచింది. ఇప్పుడు అక్కడి నుంచి తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారు.
ప్రజా సంకల్ప యాత్ర
జగన్ ఆదివారం సాయంత్రం విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు. రోడ్డు మార్గాన మేలుపువలసకు చేరుకున్నారు. సోమవారం ఉదయం అక్కడి నుంచి తన 295వ రోజు పాదయాత్రను ప్రారంభించి మక్కువ క్రాస్, కాశీపట్నం క్రాస్, పాపయ్యవలస మీదుగా కొయ్యానపేట వరకు నడిచి, రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు.
వైద్యుల సూచనలు
కాగా, గత నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పైన శ్రీనివాసరావు అనే క్యాంటీన్ ఉద్యోగి కత్తితో దాడి చేశాడు. దీంతో జగన్కు గాయమైంది. విశాఖలో ప్రాథమిక చికిత్స అనంతరం అతను నేరుగా హైదరాబాదుకు వచ్చి ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలోను వైద్యులు జగన్కు పలు సూచనలు చేశారు.
ఎడమ చేతిని ఎవరూ తాకకుండా చూసుకోవాలి
ఆదివారం వైద్యులు ఆయన గాయాన్ని పరిశీలించారు. కీలక సూచనలు చేశారు. పాదయాత్ర సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ చేతిని ఎవరూ తాకకుండా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకూ ఆ చేతిని పైకి లేపే ప్రయత్నం చేయవద్దని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే గాయం పూర్తిగా మానేందుకు సమయం పడుతుందన్నారు. ఈ మేరకు జగన్ యాత్రలో ఎడమవైపు ఎవరూ లేకుండా చూస్తామని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.