కేసీఆర్ ప్లాన్: వాటికన్లా యాదగిరిగుట్ట, తిరుపతి వలే..
హైదరాబాద్: తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టను వాటికన్ సిటీ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఆలాగే, వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న తిరుపతి మాదిరిగా యాదగిరి గుట్టకు స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ చెప్పారు.
సచివాలయంలో సోమవారం యాదగిరిగుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. యాదగిరి గుట్ట అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడానికి, అమలు చేయడానికి పర్యవేక్షణాధికారిగా ప్రస్తుతం శిల్పారామం స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కిషన్ రావును నియమించినట్టు ప్రకటించారు.
యాదగిరిగుట్టపై ప్రస్తుతం గోపురం కన్నా ఇతర కట్టడాలు ఎత్తుగా ఉన్నాయని, వాటిని తొలగించి గోపురానికి స్వర్ణతాపడంతో స్పష్టగా కనిపించే విధంగా ఇతర నిర్మాణాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అలాగే యాదగిరిగుట్ట వద్ద 2వేల ఎకరాలు సేకరించి కళ్యాణ మండపాలు, వేద పాఠశాల, సంస్కృత పాఠశాల నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.
యాదగిరి నరసింహస్వామి అభయారణ్యాన్ని అభివృద్ధి చేయడంతోపాటు సుగంధాలు వెదజల్లే వృక్షాలు, పచ్చిక బయిళ్లు, ల్యాండ్ స్కేపింగ్లు చేయాలని ఆదేశించారు. లక్ష్మీ నరసింహ స్వామి కటాక్షం కోసం దీక్షలు చేసే భక్తులు, మానసిక వ్యాధిగ్రస్తులు, ఇతర మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చేవారి బస కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని ఆదేశించారు.
గుట్టకు క్షేత్రపాలకుడైన హనుమంతుడిని ప్రత్యేకంగా కొలుచుకోవాల్సిన అవసరం ఉందని, దేశంలోనే అతి పెద్దదైన హనుమాన్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టంచనున్నట్టు చెప్పారు. గుట్టపై ప్రధాన ప్రదేశాలకు ఆధ్యాత్మిక పేర్లను పెట్టడంతోపాటు, చుట్టుపక్కలున్న గుట్టలు, రాయగిరి, గంధమల్ల చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పవిత్రత కాపాడుతామన్నారు.