ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా టీడీపీ, ప్రతిపక్ష హోదా దక్కదు: యలమంచిలి
అమరావతి: యలమంచిలి రవి శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ నేతలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వివాదాలకు లేకుంా అందరి సహకారంతో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వంటి పరిపాలన కావాలంటే, పేదలకు అన్నీ దక్కాలంటే వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. పాదయాత్రతో అధికారపక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రానున్నఎన్నికలలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగానే వ్యవహరిస్తూ వచ్చిందని, క్షేత్ర స్థాయిలో చేసింది శూన్యమన్నారు.
యలమంచిలి రవి వైసీపీలో చేరనుండటం శుభపరిణామమని గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. వివాదరహితునిగా పేరుపొందిన యలమంచిలి తమకు అదనపు బలం అన్నారు. ఇలాంటి బలమైన నాయకుని ఆవశ్యకత విజయవాడ తూర్పు నియోజక వర్గానికి ఉందన్నారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.
మోడీపై ఆగ్రహం
అంతకుముందు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ దీక్షపై మండిపడ్డారు. చేయాల్సినది అంతా చేసి ఇప్పుడు దీక్షకు దిగడం విడ్డూరం అన్నారు. బందులు నిర్వహిస్తే మనకే నష్టమన్నారు. తెలుగు ప్రజలకు మోడీ మొహం చూపించే పరిస్థితి లేదన్నారు. మోడీ పాలన బ్రిటీష్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. బీజేపీతో కలిసి కుట్రలు చేసే వారికి పుట్టగతులు ఉండవన్నారు.