సీఎం జగన్ చేసిన కరోనాకి పారాసిటామల్ వ్యాఖ్యలు: స్పందించిన సాధినేని యామిని.. ఏమన్నారంటే
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని బీజేపీలో చేరాక పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అటు అధికార పార్టీపై కానీ గతంలో తానూ ఉన్న టీడీపీపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. ఇక తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాల నేపధ్యంలో సాధినేని యామిని మాట్లాడారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కరోనా నియంత్రణ కంటే స్థానిక ఎన్నికలే సీఎం జగన్ కు ముఖ్యం
ఏపీ సీఎం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా నేత సాధినేని యామిని తప్పుబట్టారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి యామిని జగన్తో పాటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి తీసుకునే చర్యలకంటే ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికలే ముఖ్యమనే విధంగా సీఎం జగన్ ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్కు కులం అంటగడుతూ ఏక వచనంతో సంబోధించడం సీఎం జగన్ కు తగదని సాధినేని యామిని పేర్కొన్నారు.
కరోనా విషయంలో ప్రభుత్వానిది అశ్రద్ధ
జగన్ గారికి ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగ బద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే వచ్చింది కానీ రాచరికంగా రాలేదు అన్నారు యామిని. అలాంటిది ఈసీ నే తప్పుపట్టటం కరెక్ట్ కాదన్నారు. జగన్మోహన్రెడ్డి విజయసాయిరెడ్డి లాంటి వారి పరిపాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థే నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్న యామిని కరోనా విషయంలో ప్రభుత్వ తీరు అశ్రద్ధను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
పారాసిటమాల్ ట్యాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్ కరోనాను కంట్రోల్ చేస్తాయన్న సీఎం
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య అని అందుకే దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మహమ్మారిగా ప్రకటించిందని , ఇక దేశ వ్యాప్తంగా నెలకొన్న భయాందోళనలు, వ్యాధి వ్యాపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిందని సాధినేని యామిని గుర్తు చేశారు. ఇటలీలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే 40 రోజుల్లో 20 వేల మందికి కరోనా వైరస్ వ్యాప్తి జరిగి ఇప్పటికి 1400 మందికి పైగా చనిపోయారని ఆమె పేర్కొన్నారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్ కరోనా వైరస్ ని అదుపు చేస్తాయనడంలోనే సీఎం అవగాహన స్థాయి ఎ పాటిదో అర్ధం అవుతుందని ఆమె పేర్కొన్నారు.
సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు
ఇక కరోనాకు మందు లేదని బాధపడుతూ యుద్ధ ప్రాతిపదికన ప్రపంచ దేశాల్లో శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తూ కోట్లు ఖర్చు పెట్టి మందుకనిపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే పారాసిటామాల్ వేసుకుంటే కరోనా వైరస్ తగ్గిపోతుంది అని చెప్పటం కరెక్ట్ కాదన్నారు . బ్లీచింగ్ పౌడర్ వేసి కరోనా వైరస్ అదుపు చేస్తారా అని మండిపడ్డారు . కరోనాను ఎదుర్కోవడానికి ఒక పారాసిటామాల్ టాబ్లెట్ చాలని సీఎం చెప్పడం సరికాదన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి పారసిటామాల్ వేసుకుంటే అది ప్రాణాలకే ముప్పు అయ్యే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఇక బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా వైరస్ చనిపోతుందని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు . సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు
Recommended Video
ఇక జగన్ ది ఢిల్లీలో ఒక రాజకీయం ఇక్కడో రాజకీయం అని యామిని ఫైర్
ఢిల్లీ లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి దండాలు పెడతారు.. ఇక్కడ నోటికి వచ్చినట్లు మాట్లాడతారని మండిపడ్డారు . ప్రధానికి వెంకటేశ్వరస్వామి ఫోటో ఇచ్చి మాట్లాడతారు. ఇక్కడ తిరుపతిలో అన్యమత ప్రచారానికి సిద్ధం అవుతారని విమర్శించారు . రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర వినయం ప్రదర్శిస్తారని చెప్పారు . కేంద్ర ప్రభుత్వ నిధులు ఎలా దోచుకోవాలో వ్యూహాలు రచిస్తారు అంటూ సాధినేని యామిని సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.