చిరంజీవి మాటేమిటి? అది తెలియదా, జగన్తో లాలూచీ తేలిపోయింది: పవన్పై యనమల
అమరావతి: రాష్ట్రానికి ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చునని, అయితే ఆ వ్యక్తి అందరివాడు అయి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పవన్ కళ్యాణ్ సోమవారం నిర్వహించిన జనసేన కవాతుపై ఆయన స్పందించారు. జనసేనాని అన్నయ్య చిరంజీవి అందరివాడు సినిమా తీశారని, కానీ ప్రజా జీవితంలో కొందరివాడు అయ్యారని ఎద్దేవా చేశారు.
2009లో ప్రజారాజ్యం తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా పాలకొల్లులో స్వయంగా చిరంజీవి ఓడిపోయారని గుర్తు చేశారు. అందరివాడు కాబట్టే తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుమారు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. దేశంలో అవినీతిరహిత రాష్ట్రాల్లో నవ్యాంధ్ర మూడో స్థానంలో ఉందన్నారు.
ఏపీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తెలియదా?
ఈ విషయం కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని పవన్ చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా సర్వే ఏపీలో అవినీతి అతి తక్కువ ఉందని తేలిందని చెప్పారు. ఇది పవన్కు తెలియకపోవడం విడ్డూరమన్నారు.
Recommended Video
జగన్ పైన పవన్ కళ్యాణ్ పోరాటం చేయాలి
దేశమంతా రఫేల్ కుంభకోణం పైన గగ్గోలు పెడుతోందని, పవన్ కళ్యాణ్ మాత్రం దాని గురించి ఎందుకు ప్రశ్నించటం లేదని యనమల ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేయాలనుకుంటే రూ.వేల కోట్ల కొల్లగొట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన చేయాలని సూచించారు.
మోడీని వదిలి చంద్రబాబుపై ఆరోపణలా?
రఫెల్ స్కాం సూత్రధారి ప్రధాని మోడీ, అవినీతిపరుడు జగన్లను వదిలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం ఏమిటని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీలతో పవన్ లాలూచీ పడ్డారని చెప్పేందుకు ఇదే నిదర్శనం అన్నారు. ఇంతకంటే ఏం కావాలన్నారు. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ను పవన్ వెనకేసుకు వస్తున్నారన్నారు.
కొత్తదనం ఏమీ లేదు
రాజమహేంద్రవరం వద్ద జనసేన కవాతు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని యనమల అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబును, లోకేష్ను టార్గెట్ చేయడం మినహా ఏమీ లేదన్నారు. టీడీపీ లక్ష్యంగా ఆయన ప్రసంగం ఉందని చెప్పారు.