జగన్ క్విడ్ ప్రోకో 2కు తెరలేపారు ..మంత్రులు స్థాయి మరచి మాట్లాడుతున్నారు..యనమల,అమర్నాథ్ రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై, మంత్రుల తీరుపై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, వైయస్ జగన్ క్విడ్ ప్రో కో 2కు తెరలేపారని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో మంత్రుల అవినీతి పెరిగిపోయిందని, ప్రజలు అసహ్యించుకునే దాకా వెళ్లిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు.
జగన్ రెడ్డి కథ వేరే చెప్పనక్కరలేదు ..క్యాబినెట్ మంత్రులకు పేర్లు పెట్టి చంద్రబాబు వ్యంగ్యం
జగన్ బినామీ వ్యవహారాలపై అత్యున్నత విచారణ జరపాలని డిమాండ్
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు 2004 - 2009 మధ్య క్విడ్ ప్రో కో 1, ఇప్పుడు క్విడ్ ప్రో కో 2 కు సీఎం జగన్ తెరలేపారని విమర్శలు గుప్పించారు. జగన్ బినామీ వ్యవహారాలపై అత్యున్నత విచారణ జరపాలని డిమాండ్ చేసిన యనమల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. హెటిరో ముసుగులో విశాఖ బే పార్క్ ను జగన్ హస్తగతం చేసుకున్నారు అని పేర్కొన్న యనమల జగన్ రెడ్డి బినామి లావాదేవీలలో విశాఖ బే పార్క్ ఒకటి అంటూ విమర్శించారు.
కాకినాడ సెజ్ ,విశాఖ బే పార్క్ లపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : యనమల
కాకినాడ సెజ్ ,విశాఖ బే పార్క్ లపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అంతేకాదు 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన బే పార్క్ చేతులు మారడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించిన యనమల, ఎవరి ఒత్తిళ్లతో విశాఖ బే పార్క్ లో మేజర్ భాగం హెటిరో పరమైంది అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే జగన్ రెడ్డి బినామీ వ్యాపారాలు అభివృద్ధి చేస్తున్నారంటూ మండిపడ్డారు. బినామీల పేరుతో మూడు వందల రూపాయల కోట్ల విలువైన రుషికొండ భూములు జగన్ హస్తగతం చేసుకున్నారు అంటూ పేర్కొన్నారు. జగన్ తో పాటు కేసులలో ఉన్న సహా నిందితులకు జగన్ పాలనలో మేలు జరుగుతుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.
మంత్రులను చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న అమర్నాథ్ రెడ్డి
రాష్ట్ర మంత్రుల తీరుపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. మంత్రులు స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులను చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు అమర్నాథ్ రెడ్డి. మంత్రి జయరాం 400 ఎకరాలకు పైగా భూముల దోపిడీకి పాల్పడ్డారని, మంత్రి గుమ్మనూరు జయరాం ఇప్పటివరకు బెంజ్ కార్ విషయంలో సరైన సమాధానం కూడా చెప్పలేదని ఆరోపించారు.
బూతుల మంత్రులు , అవినీతి మంత్రులంటూ ఆగ్రహం
కొందరు మంత్రులు అవినీతిని ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారు అని, దాడులు చేయిస్తూ పోలీసులు కేసులు పెట్టి ఇస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి మండిపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేత తో ప్రారంభమైన వైసిపి కూల్చివేతల పర్వం నేటికీ కొనసాగుతుందన్నారు . వైసిపి పాలనలో ఏపీలో విధ్వంసం జరుగుతోందన్నారు. తాము జైలుకు వెళ్లామని , మిగతావారు కూడా జైలు కు వెళ్లాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు.