చేయాల్సింది చేశాం, జగన్ ఎందుకు మాటమార్చారో: కాపు రిజర్వేషన్లపై యనమల
అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన హామీల అమలుకు సంబంధించి సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తప్పుబట్టారు. సుప్రీం కోర్టు, చట్ట సభలను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. రైల్వే జోన్పై కేంద్రం చెప్పేదొకటి, చేసేది ఒకటి అన్నారు. పదో షెడ్యూల్లోని సంస్థలపై సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కేంద్రం అమలు చేయడం లేదన్నారు.
కాపు దెబ్బ: ఇదీ విషయం... వైసీపీ ట్విస్ట్, జగన్ వ్యూహంపై టీడీపీ అప్రమత్తం
సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఫైనల్ అన్నారు. సుప్రీం తీర్పును పట్టించుకోకుంటే ఎలా అన్నారు. పార్లమెంటులో చేసిన చట్టానికే దిక్కులేకపోతే ఎవరికి చెప్పుకోవాలన్నారు. రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని తెలిపారు. కాపు రిజర్వేషన్ల విషయంలో కేంద్రం రాజ్యంగ సవరణ చేస్తుందో లేదో చెప్పాలన్నారు. మనమైతే చట్టం చేసి పంపించామని చెప్పారు. ఈ విషయంలో మనం చేయాల్సింది చేశామన్నారు.
కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదనే విషయం వైసీపీ అధినేత వైయస్ జగన్కు అంతకుముందు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కేంద్రాన్ని నిలదీయాలన్నారు. బీజేపీతో జగన్, పవన్ అంటకాగుతున్నారని ఆరోపించారు.
కేంద్రం చెప్పే విషయాలకు, వాస్తవాలకు పొంతన లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కేంద్రంతో పోరాడుతామని చెప్పారు. పదో షెడ్యూల్ సంస్థలను విభజించాల్సిన అవసరం లేదన్న కేంద్రంపై తాము మళ్లీ అఫిడవిట్ వేస్తామని చెప్పారు.
కేంద్రమంత్రితో టీడీపీ ఎంపీల భేటీ
కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్తో తెలుగుదేశం పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ ఇటీవల కాపు రిజర్వేషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.