విజయసాయి ట్వీట్ పై యనమల కౌంటర్ .. ఊరికొకటి విలాసవంతమైన భవనాలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసు
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా విమర్శలు గుప్పించిన వైనంపై టీడీపీ సీనియర్ నేత ఎనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన విజయసాయి రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లలో చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం జగన్కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని భావించామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడికి ప్రజా సమస్యలు పట్టవని , అమరావతిలోని విలాస భవనంపై చంద్రబాబుకు చింత పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తానని అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేదా అంటూ విజయ సాయి వ్యాఖ్యలు చేశారు.
ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ మొదటిది కాదని యనమల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారని తేల్చిచెప్పారు. ఇక ఆ విషయం చెప్పకుండా అధికారంలోకి వచ్చినా, వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మాత్రం మానలేదని చురకలు అంటించారు.
అంతే కాదు విజయసాయి చంద్రబాబుకు విలాసవంతమైన భవనాల చింత పట్టుకుందా అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా విలాసవంతమైన భవనాలు ఊరికి ఒకటి చొప్పున ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసని విజయసాయి చెప్పనవసరం లేదని ఆయన విజయ సాయిని టార్గెట్ చేసి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పై విజయసాయి చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టారు.