సభా నిర్ణయాలపై కోర్టుల జోక్యం: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలకు యనమల కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. చట్టసభల విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం ఉండకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు.
రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలపై కోర్టుల జోక్యం ఉంటుంది
చట్టసభలలో తీసుకుంటున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమైనప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయని, ఈ విషయాన్ని స్పీకర్ తెలుసుకోవాలని యనమల రామకృష్ణుడు తమ్మినేని సీతారాంకు హితవు పలికారు. చట్ట సభల్లో ఆమోదం పొందిన చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైతే కోర్టు దాన్ని ప్రశ్నిస్తుంది అని, అలాంటి వెసులుబాటు కోర్టుకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం గౌరవ స్పీకర్ తెలుసుకోవాలని పేర్కొన్నారు.
సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ బిల్లులు.. మళ్ళీ సభలో పెట్టటం తప్పు
ఏపీ స్పీకర్ నిర్ణయాలు సభలోపల మాట్లాడేవాటికి, బయటమాట్లాడే వాటికి చాలా భిన్నంగా ఉన్నాయని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అంతేకాదు 10 వ షెడ్యూల్ ప్రోసిడింగ్స్ సభతో అనుసంధానించబడి ఉన్నాయని పేర్కొన్న యనమల అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగులో ఉన్నాయని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపినప్పుడు ప్రభుత్వం ఆ బిల్లులను మరోసారి సభలోకి ఎలా తీసుకు వచ్చిందని ప్రశ్నించారు. అంతేకాదు ఇది చట్ట విరుద్ధంగా జరిగిన ప్రక్రియ కాబట్టి తమ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అన్నారు .
కోర్టు పరిధిలోనే రెండు బిల్లుల అంశం
ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించిన శాసన ప్రక్రియ ఇంకా ముగియలేదు అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుసుకుంటే బాగుంటుందని యనమల రామకృష్ణుడు హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చట్టసభలో తీసుకున్న నిర్ణయాన్ని న్యాయసమీక్షకు ఎలా పెడతారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తనను టార్గెట్ చేసిన స్పీకర్ కు యనమల కౌంటర్
యనమల రామకృష్ణుడును తమ్మినేని సీతారాం టార్గెట్ చేశారు. 1997లో శాసనసభ వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని యనమల రూలింగ్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నేటికీ యనమల ఇచ్చిన రూలింగ్ అమల్లో ఉందని, కానీ ఇప్పుడు ఆయన ఆ రూల్ తో ఎలా విభేదిస్తారు అని ప్రశ్నించారు తమ్మినేని సీతారాం. తమ్మినేని సీతారాం వ్యాఖ్యలకు కౌంటర్ గా యనమల రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకుంటాయని తేల్చి చెప్పారు.