జగన్! హెరిటేజ్ 23 ఏళ్ల కష్టం నీలా కాదు, మోడీ నీకు చెప్పాలా: యనమల
23 ఏళ్లు కష్టపడితే హెరిటేజ్ కంపెనీ పైకి వచ్చిందని, కానీ జగన్ కంపెనీలలా అది సూట్కేసు కంపెనీ కాదని మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
విజయవాడ: నోట్ల రద్దు విషయం ముందుగా తెలియడం వల్లనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాగ్రత్తపడి హెరిటేజ్ షేర్లు అమ్మేశాడన్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం నాడు కౌంటర్ ఇచ్చారు.
23 ఏళ్లు కష్టపడితే హెరిటేజ్ కంపెనీ పైకి వచ్చిందన్నారు. కానీ జగన్ కంపెనీలలా అది సూట్కేసు కంపెనీ కాదని ధ్వజమెత్తారు. జగన్ కేవలం కొన్నేళ్లలోనే కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని ఆయన నిలదీశారు.
అలాగే, నోట్ల రద్దు పైన విపక్షాలతో ప్రధాని నరేంద్ర మోడీ సంప్రదించి ఉంటే బాగుండేదన్న జగన్ వ్యాఖ్యల పైన కూడా యనమల స్పందించారు. 12 ఛార్జీషీట్లు, రూ.43వేల కోట్ల నల్ల ధనం ఉన్న జగన్ను కేంద్రం ఎలా సంప్రదిస్తుందని ఎద్దేవా చేశారు.
బ్రీఫ్ కేసు కంపెనీల పితామహుడు వైయస్ జగన్ అన్నారు. పరిశ్రమలు పెట్టకుండానే రూ.10 షేర్ను రూ.1440కు అమ్మి జగన్.. హెరిటేజ్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. హెరిటేజ్ క్రమంగా ఎదిగిన కంపెనీ అన్నారు. జగన్కు దివిస్ కంపెనీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని, నల్ల ధనం అంతా బ్యాంకుల్లో జమ అయితే ఆ తర్వాత రైతు, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏమాత్రం ఉండదని యనమల రామకృష్ణుడు ఈ సందర్భంగా చెప్పారు.