రాబడులు, అప్పులు, కరోనా ఉపశమన నిధులు .. లెక్క చెప్పండన్న టీడీపీ నేత యనమల
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు కరోనా కష్టకాలంలోనూ మారటం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు . ఇక కరోనా నియంత్రణా నిధులు విడుదల చేయవద్దని ట్రెజరీలకు ఆంక్షలు జారీ చేయడం అమానుషమని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు . కేంద్రం ఇచ్చిన కరోనా ఉపశమన నిధులను తొక్కిపెట్టడం దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు . ప్రజల ప్రాణాపాయ స్థితిగతుల్లో కూడా నిధులు విడుదల చేయవద్దని చెప్పిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఇక అన్నిటికీ పేర్లు పెట్టుకుంటున్న సీఎం జగన్ కరోనా వైరస్ కు కూడా తన పేరు పెట్టుకోవాలని చెప్పారు .
కరోనా బాధితులకు 2 వేలు ఆర్ధిక సాయం .. సీఎం జగన్ నిర్ణయం
వైఎస్సార్ కరోనా, జగన్ కరోనా అని పేర్లు పెట్టుకోవాలని యనమల ఎద్దేవా చేశారు . ఉద్యోగుల జీతాలకు, కరోనా ఉపశమన సహాయ చర్యలకు నిధులు విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీకి ఆదేశాలు ఇచ్చారని ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ , కరోనా ఉపశమన నిధులు,డివల్యూషన్ కింద రావాల్సిన సొమ్ము, 14 వ ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది పుష్కలంగా వచ్చాయని యనమల తెలిపారు. ఇన్ని నిధులు వచ్చినా వాటిని ట్రెజరీ స్థాయిలోనే నిలిపేయడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు యనమల రామకృష్ణుడు .
రాబడులు, అప్పులు, కరోనా ఉపశమన నిధులు ఎంత వచ్చిందీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. నిధులు లేక డాక్టర్లు, వైద్యసిబ్బంది అనేక ఇబ్బందులు పడుతుంటే వారి అవసరాలు తీర్చటం కోసం కూడా నిధులు కేటాయించకపోవటం దారుణం అని ఆయన మండిపడ్డారు . ప్రస్తుతం కరోనా కిట్లకు, మాస్కులు, పీపీఈలకు, వైద్యం, పారిశుధ్య పనులకు నిధులు అత్యవసరంగా కావాల్సి వున్నప్పటికీ, ఈ నిధులను విడుదల చేయకుండా నిలిపివేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. వలస కార్మికుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, పెడచెవిన పెట్టిందని యనమల ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .