అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు.. ఏపీ బడ్జెట్ లో ఏముంది : యనమల
టిడిపి సీనియర్ నాయకుడు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం బంగారంలా ఉన్న రాష్ట్రాన్ని రుణ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ఆయన నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డ యనమల రామకృష్ణుడు, వైసీపీ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో ఎలాంటి ఘనత లేదని ఆయన విమర్శలు గుప్పించారు..
లోకేష్ ను కొట్టాలనే వైసీపీ మంత్రుల ప్రయత్నం... అడ్డుకోకుండా ఎలా ఉంటాం : యనమల షాకింగ్ కామెంట్స్
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అప్పుల కుప్పలుగానే ఉందని ఆయన ఆరోపించారు. అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు తప్ప ఏపీ బడ్జెట్ లో ఏమీ లేవని యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఇక బడ్జెట్ వ్యయం 6.6 శాతం పడిపోవడం ఆందోళనకరమైన అంశమని ఆయన ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం కేవలం దురుద్దేశంతో ఎకనామిక్ సర్వే లెక్కలు కూడా తప్పుగా చెప్పిందని యనమల ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్లలో మూడు లక్షల కోట్ల అప్పులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఊహించని విధంగా అప్పులు చేసిందని పేర్కొన్నారు .
ఆ మేరకు చూస్తే ఐదేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులకు సిద్ధమైందని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు యనమల రామకృష్ణుడు. ఏడాది కాలంలో 60 వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం ఏంటని ప్రశ్నించిన యనమల, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేయడమేనని ఆరోపణలు గుప్పించారు. ఇరిగేషన్ పై చివరి ఏడాది 14 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిందని యనమల లెక్కలు చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన 34 పథకాలను రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి తూట్లు పొడిచిందని ఆయన ఆరోపించారు.