చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి ఆయన అప్రకటిత అధ్యక్షుడు... మంత్రి కురసాల ఫైర్...
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. రైతులు సంతోషంగా ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. అందుకే కొన్ని పత్రికలతో విషం కక్కిస్తున్నారని మండిపడ్డారు. ఓ ప్రముఖ పత్రిక గోదావరిలో లేని వరదలను ఉన్నట్లుగా తప్పుడు కథనం ప్రచురించిందని ఆరోపించారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడారు.
కృష్ణ,గోదావరి నదులకు సంబంధించి ప్రభుత్వం అప్రమత్తం వ్యవహరిస్తోందని కన్నబాబు అన్నారు. గడచిన 3, 4 దశాబ్దాల్లో లేనంత వరద గతేడాది గోదావరి, కృష్ణా నదులలో వచ్చిందన్నారు. అన్నింటిని సమీక్షించి.. ఎక్కడా ముంపు లేకుండా ప్రభుత్వం పకడ్బందీగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందన్నారు.
పోలవరం కాంట్రాక్టర్లకు కాసులు కురిపించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు చేసిన నిర్వాకం వల్లే గత ఏడాది గోదావరికి ముంపు అధికమైందన్నారు. ఆనాడు ముంపు గ్రామాల్లో కనీస సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం 108,104 వాహనాలను తీసుకొచ్చిందన్నారు. గతేడాది వరదలకు ముంపు గ్రామాల్లో విద్యుత్ సప్లై నిలిచిపోయిందని... ఈ ఏడాది ఆ పరిస్థితులు తలెత్తకుండా 11.5మీ. ఎత్తులో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు.
మాజీ మంత్రి యనమల చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి అప్రకటిత అధ్యక్షుడని కురసాల అభివర్ణించారు. ప్రజల మధ్య అసమానతలు,అసత్యాలు ప్రచారం చేయడమే ఆయన పని అని మండిపడ్డారు.ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అందాల్సిన రూ.18120 కోట్లు ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పడం సరికాదన్నారు. ఆ తప్పుడు లెక్కలు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపుల్లో 3.9కోట్ల మందికి లబ్ది చేకూరేలా ప్రభుత్వం రూ.42603 కోట్లు ఇచ్చిందన్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక... సీఎం జగన్ 4 లక్షల మందికి సచివాలయ, వాలంటీర్ ఉద్యోగాలు కల్పించారని కన్నబాబు పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు తొలగించామని కళా వెంక్రటావ్ ఆరోపించడం సరికాదన్నారు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు తొలగించామో నిరూపించాలని సవాల్ విసిరారు.