అసలు తెలుసా: యనమల, 'కేసు పెట్టే ఆలోచన, జీవీఎల్ ఎంపీ అని ఊరుకున్నాం'
అమరావతి: బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహ రావుపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. పీడీ అకౌంట్స్ అంటే ఏమిటో జీవీఎల్కు తెలియదా అని నిలదీశారు. పీడీ అకౌంట్స్లో అవినీతికి ఆస్కారం ఉండదన్నారు.
ఆర్థిక పరిజ్ఞానంలేని జీవీఎల్ రాజ్యసభలో ఏం చర్చిస్తారన్నారు. పీడీ అకౌంట్స్ అనేవి ఆర్ధికశాఖ నియంత్రణలో జరిగే కార్యక్రమాలని, పీడీ అకౌంట్స్కు 2జీ స్కామ్కు పోలిక ఏమిటని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో 72,652 పీడీ ఖాతాలు నిర్వహించేవారని, పీడీ ఖాతాల్లో అత్యధికం స్థానిక సంస్థలకు చెందినవే అన్నారు.
జీవీఎల్ ఎంపీ అని ఊరుకున్నాం
జీవీఎల్ నర్సింహా రావు పీడీ ఖాతాలంటే ఏమిటో తెలుసా అంటూ ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు వేరుగా ప్రశ్నించారు. పీడీ ఖాతాలపై జీవీఎల్కు కనీస అవగాహన లేదన్నారు. బీజేపీ నేతల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.
అన్ని రాష్ట్రాలు పీడీ ఖాతాలను నిర్వహిస్తాయని, స్థానిక నిధులు దుర్వినియోగం కాకుండా పీడీ ఖాతాలు ఓపెన్ చేస్తామన్నారు. గుజరాత్లో 29 వేలు, బెంగాల్లో 34వేల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయన్నారు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని, అసత్య ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెట్టే దిశగా ఆలోచిస్తున్నామన్నారు. జీవీఎల్ కుల ప్రస్థావన తీసుకొస్తున్నారని, ఆయన రాజ్యసభ ఎంపీ అని ఊరుకుంటున్నామని హెచ్చరించారు.