ఎవర్నీ వదలం: ‘కాల్మనీ’పై యనమల, ‘నిందితుల్లో 27మంది జగన్ పార్టీ నేతలే’
విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ అరాచకాలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాల్ మనీ దందాపై జుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం నివేదిక వచ్చిన తర్వాత నిందితులందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో మనీలాండరింగ్ చట్టం ఉండేదని, ప్రస్తుతం తెలంగాణలోనూ ఆ చట్టం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ అరాచకాలను అరికట్టేందుకు మనీలాండరింగ్ చట్టానికి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వడ్డీ వ్యాపారులు, సంస్థల వ్యవహారాలను పూర్తిగా సమీక్షించడం జరుగుతుందన్నారు.
కాల్ మనీ కేసులో ఇప్పటి వరకు 80మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు మరో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఈ నిందితుల్లో 27మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, 6గురు తెలుగుదేశం పార్టీ, ముగ్గురు సిపిఐ, మిగితా 44మంది ఏ పార్టీకి చెందని వారున్నారని చెప్పారు.
తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కాంగ్రెస్ ఏపి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి లేదని అన్నారు. మైక్రో ఫైనాన్స్ కేసులో 200మంది చనిపోతే ఏం చేశారని పల్లె రఘునాథ రెడ్డి ప్రశ్నించారు.
కాగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన 6బిల్లులపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. అంగన్వాడీల జీతాల పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. పంచదారపై వ్యాట్, సీఎస్టీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపారు.