రాజకీయ పార్టీల టీవీలు బురద జల్లినా పత్రిక స్వేచ్ఛేనా: యనమల
హైదరాబాద్: రాజకీయ పార్టీలకు అనుబంధంగా న్న టీవీ ఛానళ్లు మిగిలిన పార్టీల పైన బురద జల్లుతున్నా, రాజకీయ కుట్రలో భాగస్వాములుగా మారి వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ప్రశ్నించారు.
అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీల వ్యూహాలకు అనుగుణంగా పని చేస్తూ ఇతరుల పైన దుమ్మెత్తి పోసినా పత్రికా స్వేచ్ఛే అవుతుందా అని ఆయన నిలదీశారు. తెలగాణ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆఫీస్ పెట్టుకున్న టీ న్యూస్.. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పెద్ద కుట్రలో భాగస్వామిగా మారిందన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై హరీష్ రావు
శనివారం విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావును ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పైన ఓ విలేకరి ప్రశ్నించారు. ఏడాదిగా నిషేధం కొనసాగిస్తుండటం ఒప్పేనా అని ఓ విలేకరి ప్రశ్నించారు. దానిపై హరీష్ రావు స్పందిస్తూ.. దానిని ఎవరు బ్యాన్ చేశారని అడిగారు.
సదరు విలేకరి మాట్లాడుతూ.. ఎంఎస్వోలు కావొచ్చు లేదా ఇంకెవరైనా కావొచ్చు కానీ సరైనదేనా అని అడిగారు. దాంతో హరీష్ రావు అది కోర్టు పరిధిలో ఉన్నదని సమాధానం దాటవేశారు. మీడియాను పది కిలోమీటర్ల అవతల పాతరేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆయన అలా అనలేదన్నారు.
మరోవైపు, ఏబీఎన్ నిషేధం పైన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధి వేణుగోపాల చారి స్పందించారు. అందులో ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయం లేదని, నేరుగా ఎక్కడా జోక్యం చేసుకోలేదని చెప్పడం గమనార్హం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిషేధంతో తమకు సంబంధం లేదన్నారు.