విజయసాయిని అసెంబ్లీకి పిలువొచ్చు: యనమల, మోడీ కిచెన్లో పెట్టుకుంటారా, సిగ్గుందా: సోమిరెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీని, పీఎంవోను కించపరిచేలా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం స్పందించారు.
పార్లమెంట్ మెట్లకు నమస్కరించి సెంట్రల్ హాల్కు బాబు, కాంగ్రెస్-బీజేపీ మినహా..
చంద్రబాబుపై విజయసాయి సభాహక్కుల నోటీసు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. సభాహక్కుల ఉల్లంఘన ఇక్కడ ఉత్పన్నం కాదన్నారు. సభా నియమాల పట్ల విజయసాయి అజ్ఞానానికి ఇదే నిదర్శనమని, ఆయన ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు చెల్లదన్నారు. అసెంబ్లీ లాబీల్లో యనమల విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
విజయసాయిని పిలిచి వివరణ కోరవచ్చు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన అంశాలపై బయటి వ్యక్తులు మాట్లాడే అధికారం ఉండదని, అంతేగాక సభా హక్కుల నోటీసు ఇవ్వడాన్ని తప్పుబడుతూ తాము కూడా విజయసాయికి నోటీసులు ఇచ్చి, అసెంబ్లీకి పిలిచి వివరణ కోరవచ్చునని తెలిపారు. అవిశ్వాస తీర్మాన నోటీసులు తిరస్కరించే అధికారం స్పీకర్కు లేదని, మంత్రివర్గంపై విశ్వాసం లేదని అవిశ్వాస నోటీసు ఇస్తారని చెప్పారు.
అసెంబ్లీలో యనమల వర్సెస్ విష్ణు కుమార్
ఏపీ అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు, విష్ణు కుమార్ రాజుల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. యనమల ఆరోగ్యంపై విష్ణు కామెంట్ చేసారు. దానికి యనమల స్పందిస్తూ.. తాను 50 నిమిషాలు మాట్లాడినా నీళ్లు తాగలేదని, విష్ణు రెండు నిమిషాలకే గ్లాస్ నీళ్లు తాగారన్నారు.
కుట్రలు చేస్తే సీఎం కాలేరు
సభాహక్కుల నోటీస్ అంటే ఏంటో విజయసాయికి తెలుసా? అని మంత్రి దేవినేని ఉమామహేశ్వ రావు ప్రశ్నించారు. దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా ఉందన్నారు. జగన్ సూట్కేసు కంపెనీలకు విజయసాయే సూత్రధారి అన్నారు. సభాహక్కుల గురించి ఏ2 కు ఇరిగేషన్ గురించి ఏ1కు తెలియదన్నారు. జగన్ అసెంబ్లీకి రాకుండా మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారన్నారు. పట్టిసీమను ఎందుకు వ్యతిరేకించారో జగన్ చెప్పాలన్నారు. గోదావరి జిల్లాల రైతులను రెచ్చగొట్టాలని చూశారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే సీఎం కాలేరన్నారు.
విజయసాయికి నొప్పి ఎందుకు?
చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెట్టడంతో బీజేపీ నేతల గుండెల్లో దడ పుడుతోందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. బీజేపీ డైరెక్షన్లోనే వైసీపీ అధినేత వైయయస్ జగన్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోడీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి నొప్పి ఎందుకని ప్రశ్నించారు.
చంద్రబాబు స్థాయికి విజయసాయి సరితూగరు
చంద్రబాబు స్థాయికి విజయసాయి సరితూగరని జీవీ ఆంజనేయులు చెప్పారు. సీఎంను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. ప్రధానిని అవమానించారంటూ చంద్రబాబుపై విజయసాయి సభాహక్కుల నోటీసు ఇవ్వడం వెనుక ఉన్న అంతరార్థం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. హోదా కోసం అందరూ పోరాడుతున్న సమయంలో ఇలాంటి నీచమైన లాలూచీ రాజకీయాలు ఏమిటన్నారు.
విజయసాయిని మోడీ నెత్తిమీద పెట్టుకున్నారు
విజయసాయిని ప్రధాని మోడీ నెత్తిమీద పెట్టుకుంటున్నారని, కిచెన్లో పెట్టుకుంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలను నెత్తిన కూర్చోబెట్టుకుంటారా అని ప్రశ్నించారు. మిత్ర పక్షాలను గౌరవించే సంప్రదాయం బీజేపీకి లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాక బీజేపీని ఎవరూ నమ్మడం లేదన్నారు. బీజేపీకి లోకసభ నడిపే సత్తా లేదని, అలాంటప్పుడు ఎలా పరిపాలిస్తారని, ఏం చట్టాలు తెస్తారన్నారు. ఆఫ్టరాల్ చిన్న లోకల్ పార్టీ ఏడీఎంకే ఆందోళన చేస్తే పది రోజులుగా సభ జరగదా అని ప్రశ్నించారు. సిగ్గులేదా అన్నారు. ఎన్డీయేలో మిత్రపక్షం ఉన్నంత వరకు చంద్రబాబు మహానేత అయితే, ఇప్పుడు అవినీతిపరుడు అయ్యారా అని బీజేపీని ప్రశ్నించారు.