‘మై బ్రిక్-మై అమరావతి’కి అనూహ్య స్పందన, బాసరలో ఏపీ ఆర్ధికమంత్రి
హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ‘మై బ్రిక్ - మై అమరావతి'కి అనూహ్య స్పందన లభిస్తోంది. ఐదో రోజుకు సుమారు 20 లక్షలకు పైగా ఈ-ఇటుకలను ఆన్లైన్లో విరాళమిచ్చారు.
ఈరోజు వరకు ఆన్లైన్లో ఇటుకలు విరాళమిచ్చిన దాతల సంఖ్య 31,622కు చేరింది. ‘మై బ్రిక్ - మై అమరావతి' అనే ట్యాగ్లైన్తో ఉన్న ‘http://amaravati.gov.in/' వెబ్సైట్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదు రోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ వెబ్ సైట్ ను ప్రారంభించిన కొద్ది క్షణాలకే సింగపూర్లో ఉంటున్న ప్రవాసాంధ్రుడు ఒకరు 108 ఇటుకలను ఈ సైట్ ద్వారా కొనుగోలు చేశారు. ఒక్కో ఇటుక ధర రూ.10గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
బాసరలో ఏపీ ఆర్ధికమంత్రి
ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడి మనవరాలికి ఆదిలాబాద్ జిల్లా బాసర సర్వస్వతీ అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్యక్రమానికి యనమల దంపతులు, వారి కుమార్తె కృష్ణ సాహిత్య, అల్లుడు మహేష్లు మనవరాలి సృష్ణి వైష్ణవి (3) కి అక్షరాభ్యాసం చేయించారు.
సృష్ణి వైష్ణవి (3) అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద పండితులు శ్రీనివాస్, సంజీవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి యనమలతో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు సుధాకర్ యాదవ్ దంపతులు కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి యనమల గోదావరి నదిని పరిశీలించారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం గోదావరి నీటిని, మట్టిని స్థానిక టీడీపీ నాయకులు సేకరించి యనమలకు ఇచ్చారు.
అమరావతికి కురుమూర్తి స్వామి పుష్కరిణి నీరు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం మహబూబ్నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీకురుమూర్తి స్వామి దేవస్థానం నుంచి స్వామి వారి పుష్కరిణి నీరు, మట్టిని సేకరించారు. సోమవారం మండల టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో పుష్కరిణికి పూజ చేసి ఆ నీటిని, ఆలయ సమీపంలో పాముపుట్టకు పూజలు చేసి మట్టిని సేకరించారు.
ఆ తర్వాత వాటిని స్వామివారి సన్నిధిలో మళ్లీ పూజలు నిర్వహించి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్కి తరలించారు. అక్కడి నుంచి వాటిని అమరావతికి తరలించనున్నారు.