కేంద్రం కుట్రలు పన్నుతోంది, మోడీలా ఎవరూ లేరు: యనమల ఆగ్రహం, ‘పవన్, జగన్తో అన్యాయం’
అమరావతి: కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకే జమిలి ఎన్నికల ఎత్తుగడను బీజేపీ ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు.
Recommended Video
జాతీయ పార్టీలకు విఘాతం
ఏ జాతీయ పార్టీ కూడా సొంత బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేదని యనమల అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో బలోపేతం కావడం రాజకీయంగా జాతీయ పార్టీలకు విఘాతంగా మారిందన్నారు.
15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తికి ప్రమాదకరంగా మారాయలని యనమల వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలే ఈ మార్గదర్శకాలను 15వ ఆర్థిక సంఘానికి సూచించారని తెలిపారు.
ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే
జీఎస్టీని కూడా రాష్ట్రాలను బలహీనపర్చేందుకే వాడుకుంటున్నారని ఆరోపించారు.రాష్ట్రాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాయాలని చూస్తున్నారని కేంద్రంపై యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం, ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపర్చడం అజెండాగా కేంద్రంలోని బీజేపీ నేతలు పెత్తందారీ పోకడల్లో వ్యవహరిస్తున్నారని యనమల వ్యాఖ్యానించారు.
మోడీ తరహాలో ఎవరూ చేయలేదు
ప్రధాని నరేంద్ర మోడీ తరహాలో గతంలో ఎవరూ ఇలా రాజకీయ కుట్రలు చేయలేదని, మోడీ, అమిత్ షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇతర ప్రాంతీయ పార్టీలకు యనమల రామకృష్ణుడు సూచించారు. తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తోపాటు ఏపీలో టీడీపీ పట్ల బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తోందని అంతా గమనిస్తున్నారని యనమల చెప్పారు.
ఏపీకి ద్రోహం చేస్తున్న పవన్, జగన్
ఇది ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యి.. ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్ నుంచి పూర్తి స్థాయిలో కేంద్రం ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని, ఏపీకి మాత్రం మొండి చెయ్యి చూపిస్తోందని ఆయన ఆరోపించారు.