టైటానియం స్కాంలో పాత్ర లేదా?: జగన్కు యనమల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని సిబిఐ, ఎఫ్బిఐలు ధ్రువీకరించాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టైటానియం కుంభకోణంలో తన పాత్ర లేదని, ఎఫ్బిఐ చెప్పిన బంధువు తాను కాదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు.
రైతుల రుణమాఫీ చేయలేరంటూ జగన్ చెప్పడం హాస్యాస్పదమని యనమల అన్నారు. దోచుకునేందుకు లక్ష కోట్లు ఉంటాయి కానీ రుణమాఫీకి డబ్బు ఉండదా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
సబిత, కృపానందంలపై సిబిఐ ఛార్జీషీటు దాఖలు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ కృపానందంలపై సిబిఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఓఎంసి కేసులో సిబిఐ బుధవారం తుది ఛార్జీషీటు దాఖలు చేసింది.
ఐపిసి 125, 120బి, 409 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (2) కింద కేసు నమోదు చేసినట్లు సిబిఐ పేర్కొంది. అంతర్రాష్ట సరిహద్దు వివాదం మినహా ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తెలిపింది.