జగన్కు ఢిల్లీలో రెండోసారి పరాభవం: అందుకేనంటూ యనమల రామకృష్ణుడు నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో యనమల మీడియాతో మాట్లాడారు.
అందుకే జగన్ ఢిల్లీకి..
కేసులను పరిష్కరించుకునేందుకే వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారని.. అందుకే కేంద్ర హోంమంత్రి అనుమతివ్వలేదని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా తన సొంత కేసులు, డిశ్చార్జ్ పిటిషన్లు, కోర్టు హాజరీ మినహాయింపుల గురించే అడుగుతున్నారని విమర్శించారు.
రెండోసారి పరాభవం.. అయినా..
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రెండోసారి ఢిల్లీలో పరాభవం ఎదురైందని యనమల ఆరోపించారు. ఆయన ఢిల్లీకి వెళ్లేది స్వప్రయోజనాల కోసమని.. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టం అంశాల అమలుపై కాదని ఈ మాజీ ఆర్థికమంత్రి విమర్శించారు.
జగన్కు అదే భయం..
ఫెమా, మనీలాండరింగ్పై సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ పీకల్లోతు కూరుకుపోయారని అన్నారు. శిక్షపడే సమయం దగ్గర పడిందనే భయం పట్టుకుందని, ప్రజా ప్రయోజనాల కోసమే వస్తే అపాయింట్మెంట్ ఇస్తారన్నారు. తన కేసుల గురించి అడుగుతున్నారు కాబట్టే.. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.
వాయిదాలు ఎగ్గొట్టేందుకే పర్యటనలు
ప్రతి శుక్రవారం ఏదో ఒక పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విచారణ ప్రారంభమైతే తన నేరాలు రుజువు అవుతాయనే భయంతో ఉన్నారని అన్నారు. గత మూడు శుక్రవారాలు ఏదో వంకతో కోర్టు హాజరీకి డుమ్మా కొట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళారుల స్వైర విహారం పెరిగిపోయిందన్నారు. ఇటు రైతులను, అటు వినియోగదారులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రానున్న కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడంతోపాటు, వైసీపీ 6నెలల పాలన వైఫల్యాలను ఎండగడతామని యనమల స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ జగన్ మాయలు.. పథకాలు, ప్రకటనలే తప్ప అమలు లేదని యనమల ఆరోపించారు. ప్రతి పథకంలో కోత పెడుతున్నారని, అలా అయిన డబ్బుతో కొత్త పథకాలు అంటూ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు.