‘జగన్ కోర్టుకు హాజరైతే రూ. 60లక్షల ఖర్చా..? నిబద్ధత ఉంటే ఇలా చేయండి’
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాధనం వృథా అవుతోందన్న వంకతో కోర్టు వాయిదాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
ఆ ప్రమాదం రెట్టింపు..
శనివారం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.. అధికారంతో కేసులను ప్రభావితం చేసే ప్రమాదం గతం కన్నా ఇప్పుడు రెట్టింపు అయ్యిందని, సీఎం హాజరుకు మినహాయింపు అడగడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని యనమల అన్నారు. సహనిందితులకు, సాక్ష్యులకు ఉన్నత పదవులు కట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కోర్టుకు హాజరైతే.. రూ. 60లక్షలా..
చట్టం ముందు అందరూ సమానులేనని, శిబుసోరెన్ ముఖ్యమంత్రిగా ఉప్పుడు కూడా కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైతే రూ. 60లక్షలు ఖర్చు అవుతోందని చెప్పడం హాస్యాస్పదమన్నారు యనమల రామకృష్ణుడు. జగన్మోహన్ రెడ్డి సొంత కేసులే కాబట్టి ఆ ఖర్చు జగన్మోహన్ రెడ్డి భరించాలని అన్నారు.
అధికారం లేనప్పటి కేసు..
అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కేసులు ఇవని.. అప్పటి కేసులకు ఇప్పుడు ప్రజల సొమ్ము ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో హాజరు మినహాయింపును గతంలోనే సీబీఐ కోర్టు, హైకోర్టు తిరస్కరించాయన్నారు. రాజకీయ నేతలతోపాటు మీడియాపైనా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని యనమల మండిపడ్డారు.
నిబద్ధత ఉంటే ఇలా చేయండి..
ప్రజాధనం వృధా కాకూడదనుకుంటే.. సలహాదారుల పోస్టులు ఇంతమందికి ఎందుకు కట్టబెట్టడం అని, వారికి భారీ జీతభత్యాలు ఎందుకు ఇవ్వడమని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి నిబద్ధత ఉంటే.. ఆయన వ్యక్తిగత కేసుల కోసం ప్రజాధనం వృథా చేయకుండా.. సొంత డబ్బులతోనే కోర్టు వాయిదాలకు హాజరుకావాలన్నారు.
యనమల సవాల్..
అసత్య వార్తలతో ప్రత్యర్థి పార్టీలపై దుష్ప్రచారం చేసింది ఏ మీడియానో అందరికీ తెలిసిందేనని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మీడియాను అణిచివేసి.. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని జగన్ సర్కారుపై మండిపడ్డారు. విద్యుత్ కోతలు, వ్యాపారులకు బెదిరింపులు జగన్మోహన్ రెడ్డి స్వార్ధపూరిత దోరణికి నిదర్శనమన్నారు.