కొలాప్స్ అయ్యే స్థితిలో రాష్ట్రం, కక్షసాధింపు, వేధింపులు ఆపాలి: శిక్షిస్తామంటూ యనమల రామకృష్ణుడు
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికారులను గౌరవించామని, కానీ ఇప్పుడు అలా లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వేధింపులు, కక్ష సాధింపు ఆపాలి..
గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుంటోందని యనమల మండిపడ్డారు. అధికారులపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అధికారులను వేధించడం మానుకోవాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. ఇటీవల శాసనమండలిలో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. నిరంకుశ పరిపాలనలో ఏ వ్యవస్థను స్వచ్ఛందంగా నడుచుకునే అవకాశం లేకుండా చేస్తోందని జగన్ సర్కారుపై మండిపడ్డారు. వచ్చిన బిల్లులను చెక్ చేసే పవర్ ఉందని శాసనమండలికి ఉందని అన్నారు.
అసెంబ్లీలో బుల్డోజ్ చేస్తే.. మండలిలో చెక్ పెట్టాం..
బిల్లులు తీసుకొచ్చినప్పుడు రాజ్యసభకు ఉన్న అధికారాలే రాష్ట్రంలోని శాసనమండలికి ఉన్నాయని యనమల రామకృష్ణుడు చెప్పారు. అసెంబ్లీలో బిల్లులను బుల్డోజ్ చేసి పంపించారని, ప్రజలకు ఉపయోగపడేవైతేనే మండలి ఆమోదిస్తుందని చెప్పారు. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చారని.. ఆ బిల్లులను అసెంబ్లీలో బుల్డోజ్ చేసి మండలికి తీసుకొచ్చారని ఆరోపించారు. అందుకే తాము ఆ రెండు బిల్లులకు మండలిలో చెక్ పెట్టామని యనమల చెప్పారు.
మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు..
మండలి ఛైర్మన్ ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారని తెలిపారు. ఛైర్మన్ అధికారులు కూడా అధికార వైసీపీ సభ్యులకు తెలియవని మండిపడ్డారు యనమల.
తాము బిల్లులను అడుడ్కోలేదని, సెలక్ట్ కమిటీకి పంపించామని తెలిపారు. మండలి ఛైర్మన్.. సెలక్ట్ కమిటీకి పేర్లను తీసుకోవాలని సెక్రటరీని ఆదేశిస్తే.. ఆయన పడుతున్నారని.. ఆయన భయానికి ప్రభుత్వమే కారణమని అన్నారు. మండలి వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి లేదని యనమల చెప్పారు. డివిజన్ ఇవ్వడానికి అధికార పార్టీ అడ్డుపడిందని మండిపడ్డారు. రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి ఛైర్మన్ పంపించారని తెలిపారు. ఛైర్మన్ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేరని యనమల చెప్పారు. అధికార పార్టీకి కంటెంప్ట్ ఆఫ్ హౌస్ కింద ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.
నిరంకుశంగా అధికార పార్టీ..
తమకు మండలిలో మెజార్టీ ఉందని యనమల వ్యాఖ్యానించారు. ఛైర్మన్ను నిందించారు కాబట్టి.. సుమోటోగా కూడా వాటిని తీసుకునే అధికారం ఛైర్మన్కు ఉంటుందని తెలిపారు. తాము బిల్లులను వ్యతిరేకించకపోయినప్పటికీ.. అధికార పార్టీ నిరంకుశంగా ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ప్రోరోగ్ ఫైల్ మూవ్ చేశారని, సభ సైనీడైలో ఉందని చెప్పారు. ప్రోరోగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అధికార పార్టీని ప్రశ్నించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా బడ్జెట్ సమావేశాలకు మళ్లీ పిలవాల్సిందే కదా అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రోరోగ్ చేసిన బిల్లులు అలాగే ఉంటాయన్నారు. అసెంబ్లీ డిసాల్వ్ అయితేనే బిల్లులు కొలాప్స్ అవుతాయని, మండలి డిసాల్వ్ అయ్యే అవకాశం లేదని యనమల స్పష్టం చేశారు. అవసరమైతే ఎమ్మెల్సీ ప్రతినిధులమంతా గవర్నర్ను కలిసి మండలిపై, సెక్రటరీ వ్యవహారశైలి, అధికార పార్టీ సభ్యుల తీరుపై ఫిర్యాదు చేస్తామని యనమల చెప్పారు.
కంటెంప్ట్ ఆఫ్ హౌస్ పెడతాం...
జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ హౌస్ ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించిన ఆయన.. సెక్రటరీ మీద కూడా పెడతామని చెప్పారు. ఒక వేళ ఆర్డినెన్స్ ఇవ్వాలనుకుంటే గవర్నర్ సీరియస్గా తీసుకోవాలని అన్నారు. ఆర్డినెన్స్ ఇస్తారనుకోవడం లేదని ఇచ్చినా.. మండలికి రావాల్సిందేనని అన్నారు.
తాము ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే మండలి అనుమతించదని అన్నారు.
కుప్పకూలే పరిస్థితో రాష్ట్రం..
స్టేట్ కొలప్స్ అయ్యే స్థితిలో ఉంది. స్టేట్ కొలాప్స్ అయ్యే స్థితిలో ఉందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఎకానమీ, బిజినెస్ పడిపోయిందని.. పెట్టుబడులు రావడం లేదని, సంక్షేమ పథకాలు లేవని అన్నారు. అధికార పార్టీ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే వారిని మండలిలో శిక్షిస్తామని చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ను విమర్శించారని, అవమానించారని.. అందుకే అధికార పార్టీ సభ్యులపై కంటెంప్ట్ ఆఫ్ హౌస్ పెడతామని యనమల చెప్పారు.