అసలు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిందెంతో తెలుసా?: ఐటీ పంచనామా రిపోర్ట్ ఇదే, యనమల ఫైర్
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో జరిగిన ఐటీ సోదాలపై తప్పుడు ప్రచారం చేశారంటూ వైసీపీ నేతలు, సాక్షిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామా నివేదికపై ఆయన ఆదివారం స్పందించారు.
రూ. 2లక్షలు దొరికితే 2 వేల కోట్లంటారా?
ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ. 2 వేల కోట్లు దొరికాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడంపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులపాటు జరిగిన ఐటీ దాడులను సొంత మీడియాలో బూతద్దంలో పెట్టి చూపారని, రూ. 2లక్షల నగుదుకు బదులు రూ. 2 వేల కోట్లని దుష్ప్రచారం చేశారని వైసీపీ, సాక్షిపై మండిపడ్డారు.
టీడీపీ, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి..
అంతేగాక, 26 డొల్ల కంపెనీలు ఉన్నాయని వైసీపీ చేసిన ఆరోపణలు అబద్ధాలకు పరాకాష్ట అని యనమల ధ్వజమెత్తారు. పంచనామా నివేదికపై అధికార వైఎస్సార్ కాంగ్రెస పార్టీ నేతలు స్పందించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేతలు టీడీపీ, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలన్నారు.
వైసీసీ నేతలు, సాక్షిని వదిలిపెట్టం..
దుష్ప్రచారం చేసిన వైసీపీ నేతలు, సాక్షి మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యనమల రామకృష్ణుడు అన్నారు. అంతేగాక, వైసీపీ నేతలు, సాక్షి మీడియాపై పరువునష్టం దావా వేస్తామని యనమల హెచ్చరించారు. వైసీపీ నేతలు, సాక్షి మీడియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ప్రెస్కౌన్సిల్, ఎడిటర్స్ గిల్ట్కు ఫిర్యాదులు చేస్తామని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
ఐటీ పంచనామా రిపోర్టు ఏం చెప్పిందంటే..?
కాగా, చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన సోదాలకు సంబంధించిన పంచనామా నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ ఇంట్లో రూ. 2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆ నివేదికలో వెల్లడైంది. ఐటీ సోదాల అనంతరం పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారులు సంతకాలు చేసినట్లు నివేదిక పేర్కొంది. రూ. 2 వేల కోట్లు ఐటీ దాడుల్లో లభించాయంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.